నర్సంపేట, సెప్టెంబర్ 30 : బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కుదరదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాట్లాడడం సరికాదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఉక్కు పరిశ్రమపై కిషన్రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ పెద్ది శుక్రవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో పుట్టిన కిషన్రెడ్డి ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం కేంద్రాన్ని ప్రశ్నించాల్సింది పోయి వారి చెంతన చేరడం సరికాదన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయంలో మోదీ సర్కారు తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నదని ధ్వజమెత్తారు. అదేవిధంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదని చెప్పడం బీజేపీకి తెలంగాణపై ఎంతటి చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతున్నదని ఎద్దేవా చేశారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వేలాది మంది యువతీ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పరిశ్రమ ఏర్పాటును అడ్డుకొని యువతకు ఉపాధిని దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కిషన్రెడ్డి బేషరతుగా గిరిజన సమాజానికి, తెలంగాణ యువతకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను ఏకం చేసి పోరాటాలను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
వైఎస్ ఆశయాలను తుంగలో తొక్కిన వైఎస్సార్ సీపీ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను ఏపీలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. పట్టణంలో శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉచిత విద్యుత్ పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ వైఎస్ ఆశయాలను నెరవేర్చడం లేదని మండిపడ్డారు.మోటర్లకు మీటర్లు పెట్టి రైతులను మోసం చేస్తున్నదని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై వైఎస్సార్ సీపీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేయడం తగదని అన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావుపై.. వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ ఐటీ మంత్రి అమర్నాథ్రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. టీచర్స్ యూనియన్ సమావేశంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తగదని అన్నారు. మంత్రి హరీశ్రావు చెప్పింది ముమ్మాటికీ నిజం అని, అందులో ఎలాంటి అవాస్తవాలు లేవని ఎమ్మెల్యే పెద్ది స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం మంచి ఫిట్మెంట్ ఇస్తే, ఏపీ నామమాత్రపు ఫిట్మెంట్ ఇచ్చిందని వివరించారు. కేంద్రం విధించిన షరతులకు తలొగ్గి మీటర్లు పెట్టి ఏడు వేల కోట్ల రూపాయలు తీసుకున్నా మెరుగైన ఫిట్మెంట్ ఇవ్వలేక పోయారని హరీశ్రావు తెలిపారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ పథకాలు, ప్రాజెక్టులపైన అనేకసార్లు ఫిర్యాదు చేసిందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులను కించపరిచే విధంగా మంత్రి హరీశ్రావు మాట్లాడారని సజ్జల అనడం సరికాదని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణకు వ్యతిరేకులుగా ఉన్న వారిని, విషంకక్కిన వారిని మాత్రమే వ్యతిరేకించామని అన్నారు. ఇతర రాష్ర్టాల వారిపై, ప్రభుత్వ ఉద్యోగులపై మంత్రి హరీశ్రావు ఏనాడూ తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. ప్రచారం కోసం ఏపీ నాయకులు.. తెలంగాణ, టీఆర్ఎస్ నాయకులు, మంత్రి హరీశ్రావుపై వ్యాఖ్యలు చేయవద్దని ఎమ్మెల్యే పెద్ది హితవు పలికారు.