కాజీపేట, మార్చి 2 : కాజీపేట రైల్వే జంక్షన్లో ఒకటో నంబర్ ప్లాట్ఫాంపై రెండు రైళ్లు ఒకేలా ఉండడం, అధికారులు చేసిన అనౌన్స్మెంట్తో ప్రయాణికులు ఆగమాగమైన ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. ఒకటో నంబర్ ప్లాట్ఫాంపై బలార్షాకు వెళ్లే రామగిరి, సికింద్రాబాద్కు వెళ్లే పుష్పుల్ రైళ్లు నిలిపారు. ఈ క్రమంలో అధికారులు ఒకటో నంబర్ ప్లాట్ఫాంపై రామగిరి ఉందని, మరికొంత సేపటికే సికింద్రాబాద్ పుష్పుల్ రైలు కూడా ఉందని అనౌన్స్ చేశారు. రెండు రైళ్లు ఒకేలా ఉండడం.. ఆదివారం సెలవు దినం ముగిసి సోమవారం వర్కింగ్ డే కావడంతో తప్పని పరిస్థితిల్లో వెళ్లాల్సిన ప్రయాణికుల్లో కొందరు బలార్షా వైపునకు వెళ్లే వాళ్లు సికింద్రాబాద్ పుష్పుల్, సికింద్రాబాద్ పుష్పుల్లో వెళ్లాల్సిన వారు బలార్షాకు వెళ్లే రామగిరి రైలులో కూర్చున్నారు.
రైల్వే జంక్షన్ నుంచి మొదటగా రామగిరి రైలు కదిలి బలార్షా వైపునకు వెళ్తుండగా, సికింద్రాబాద్కు వెళ్లాల్సిన ప్రయాణికులు గమనించి లబోదిబోమంటూ చైన్ను లాగి కిందికి దిగి సికింద్రాబాద్కు వైపునకు వెళ్లే పుష్పుల్ రైలుక్కారు. బలార్షా వైపునకు వెళ్లే రామగిరి ప్రయాణికులు కూడా గమనించి సికింద్రాబాద్ పుష్పుల్ చైన్ లాగి కిందికి దిగి వారు వెళ్లే రైలు ఎక్కారు. సుమారు అరగంటకు పైగా ప్రయాణికులు ఆగమయ్యారు. అదేవిధంగా కాజీపేట రైల్వే జంక్షన్లో ప్లాట్ఫాంలు ఖాళీ లేకపోవడంతో సికింద్రాబాద్ నుంచి విజయవాడ వైపునకు వెళ్లే నాగవళి, కోణార్క్ ఎక్స్ప్రెస్ రైళ్లను అధికారులు ఓటర్లోనే దాదాపు గంటపాటు నిలిపివేశారు.