వరంగల్ చౌరస్తా, డిసెంబర్22: ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా జేఎన్1 వేరియంట్ వరంగల్ను తాకింది. డిసెంబర్ 21న కరోనా లక్షణాలతో ఎంజీఎం సారి వార్డులో చేరిన భూపాలపల్లి జిల్లా గణపురానికి చెందిన 62 ఏళ్ల మహిళకు ర్యాపిడ్ టెస్టు నిర్వహించిన వైద్యాధికారులు పాజిటివ్గా గుర్తించి మరింత కచ్చితత్వం కోసం మరో ఆరుగురి నమూనాలతో కలిపి కేఎంసీలోని వైరాలజీ ల్యాబ్లో ఆర్టీపీసీఆర్ టెస్టులకు పంపారు. శుక్రవారం ల్యాబ్ నిపుణులు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా మహిళతో పాటు నగరానికి చెందిన మరో వ్యక్తికి కరోనా జేఎన్1 సోకినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. కరోనా సోకిన ఇద్దరిలో వయసు దృష్ట్యా సదరు మహిళను కొవిడ్ వార్డుకు తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యాధికారులు తెలిపారు. నగరానికి చెందిన వ్యక్తిని హోం ఐసొలేషన్కు తరలించారు.
ఈ సందర్భగా ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ మనిషి ప్రాణాలపై పెద్దగా ప్రభావం చూపదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం ఎంజీఎంలో ర్యాపిడ్ కరోనా టెస్టులు చేస్తున్నామని, అనుమానితులు ఎవరైనా ఉన్నట్లయితే ఉచితంగా పరీక్షలు చేయించుకోవచ్చునని తెలిపారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తులకు అవసరమైన వైద్యసేవలు, ఔషధాలు అందించడానికి పూర్తి సంసిద్ధతతో ఉన్నామని అన్నారు. ప్రస్తుతం 50 పడకలతో వార్డు ను కొనసాగిస్తున్నామని, 70 వెంటిలేటర్లు, 200 పడకలు, 10వేల సర్జికల్ మాస్కులు, 5వేల ఎన్95 మాస్కులు, శానిటైజర్, తదితర వైద్య అవసరాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అవసరాన్ని బట్టి మరిన్ని సమకూర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయని తెలిపారు.