వారు ఎంతో దూరం నుంచి బయలుదేరారు. వనదేవతల దీవెనలు పొందాలని కోటి ఆశలతో తమ పిల్లలను తీసుకొని వ్యవప్రయాసాలకోర్చి వరంగల్కు చేరుకున్నారు. తెల్లవారితే తల్లుల చెంతకు చేరే క్రమంలో ఆ పిల్లలిద్దరూ విగత జీవులయ్యారు. ఈ హృదయవిదారక ఘటన వరంగల్ నగరంలో జరిగింది.
-కాశీబుగ్గ, ఫిబ్రవరి 17
నీటి సంపులో పడి ఇద్దరు పిల్లలు మృతి చెందిన ఘటన వరంగల్ 14వ డివిజన్ బాలాజీనగర్లో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. బాలాజీనగర్కు చెందిన మరికల రమ, శ్రీనివాస్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురు భలేశ్వరిని వికారాబాద్ జిల్లా తాండురుకు చెందిన కరణం రవికుమార్కు ఇచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం జరిపించారు. రవికుమార్ తాండూరులో పూజారిగా పని చేస్తున్నాడు. వీరికి శౌరితేజ(3), తేజస్విని(2) ఇద్దరు పిల్లలు ఉన్నారు. మేడారం జాతర సం దర్భం గా రవికుమార్-భలేశ్వరి దంపతులు తమ పిల్లలను తీసుకొని శుక్రవారం రాత్రి బాలాజీనగర్లోని తమ తల్లిగారింటికి వచ్చారు. శనివారం మేడారం జాతరకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు.
అయితే, చాలా దూరం నుంచి ప్రయాణం చేయడంతో అలిసిపోయిన వారు పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రించారు. కొంత సమయం తర్వాత రవికుమార్, భలేశ్వరి నిద్రలేచి చూడగా పిల్లలు కనిపించలేదు. వెంటనే వారు ఇంటి చుట్టూ వెతికారు. చివరకు నీటి సంపులో చూడగా ఇద్దరు పిల్లలు విగత జీవులుగా కనిపించారు. వెంటనే వారిని కుటుంబ సభ్యులు ఎంజీఎం దవాఖానకు తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
దీంతో వారి రోదనలు మిన్నంటాయి. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారుల మృతితో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు కంటతడి పెట్టారు. కాగా, తల్లిదండ్రులు ఆదమరిచి నిద్రించడంతో పిల్లలు ఆడుకుంటూ వెళ్లి నీటిసంపులో పడి మృతి చెంది ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎనుమాముల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.