నర్సింహులపేట, సెప్టెంబర్ 20 : పసుపు సాగు రైతన్న ఇంట సిరులు కురిపిస్తోంది. ఏటా నష్టం మిగిల్చే ఈ పంటకు ఈ ఏడాది మార్కెట్లో రికార్డు స్థాయి ధర పలుకుతుండడంతో విరివిగా లాభాలు తెచ్చిపెడుతోంది. అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగడం, రాష్ట్రంలో పంట దిగుబడి తగ్గడంతో ధరలు అమాంత రెండింతలైంది. ఒకప్పుడు క్వింటా రూ.6వేలు దాటని పంటకు ప్రస్తుతం రూ.13వేల నుంచి 16వేల మధ్య పలుకడం రైతుల్లో సంతోషం కనిపిస్తోంది.
మొన్నటివరకు గిట్టుబాటు ధర రాక కొంతకాలంగా రైతులు క్రమంగా పసుపు సాగు తగ్గిస్తూ వచ్చారు. సాగుచేసినా దిగుబడిని మారెట్కు తరలించడం కష్టమైన పనే. పసుపు కొమ్ములు తవ్వడం, ఉడకబెట్టడం, ఆరబెట్టడం, కొమ్ము వేరు చేయడం, ఆపై మారెట్కు చేరవేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్కువ శ్రమించాల్సి ఉన్నందున చాలామంది రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్నట్టుండి రికార్డుస్థాయిలో పసుపు ధర పెరుగుతున్నది. గత పదేళ్లలో పసుపు ధర ఈ స్థాయిలో పలకడం ఇదే తొలిసారి. ఒక దశలో రెండింతలు కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో పసుపు ఉత్పత్తి గణనీయంగా ఉంటోంది. ఉత్పత్తిలో దేశంలోనే మనది రెండో స్థానం. రాష్ట్రంలో దాదాపు 330 మెట్రిక్ టన్నుల పసుపు ఏటా దిగుబడి అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఫార్మా కంపెనీలతో పాటు కాస్మోటిక్స్ కంపెనీలు పెద్ద మొత్తంలో పసుపును కొనుగోలు చేస్తుండడం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది. మరోవైపు దేశీయ మారెట్లోనూ గృహావసరాలకు పసుపు ఉత్పత్తులను అమ్మే కంపెనీలు కూడా పెద్ద మొత్తంలో పసుపును కొనుగోలు చేస్తున్నాయి.
మానుకోటలో 374 ఎకరాల్లో సాగు
మహబూబాబాద్ జిల్లాలో 374 ఎకరాల్లో పసుపు సాగు చేస్తున్నారు. అత్యధికంగా కేసముద్రం, నర్సింహులపేట, నెల్లికుదురు, దంతాలపల్లి, మహబూబాబాద్ మండలాల్లో పసుపు పంట సాగుచేస్తున్నారు. నీటి సౌకర్యం ఉన్నా దుంపకుళ్లు, వివిధ రకాల తెగుళ్లు సోకి దిగుబడి తగ్గింది. గతేడాదితో పోల్చితే ఈసారి పసుపు దిగుబడి తగ్గినా మార్కెట్లో ధర మాత్రం రైతులకు ఆశాజనకంగా ఉంది. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నప్పటికీ బావుల్లో నీరు తగ్గలేదు. దీని వల్ల సాగు చేసిన పంటలు ఎండిపోకుండా నీరు అందిస్తూ సంతోషంగా సాగు చేసుకుంటున్నారు.
గతేడాది 30 క్వింటాళ్లు వచ్చింది
గతేడాది పసుపు పంటకు దుంపకుళ్లు వచ్చి కొంత నష్టం వచ్చింది. అయినా రెండు ఎకరాల్లో 65 పేనాలు ఉడిక పెడితే 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. మంచి ధర ఉంది. ఈ ఏడాది కూడా రెండెకరాల్లో పసుపు వేశా. ఇప్పుడు పంట బాగుంది. ఇదే ధర పంట చేతికొచ్చే దాకా ఉంటే మంచిగుంటది. గతేడాదితో పోల్చితే దిగుబడి తగ్గినా ధర మాత్రం ఎక్కువగానే ఉండడం సంతోషంగా ఉంది. మారెట్లో పసుపు ఇప్పుడు ధర బాగున్నా సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. మిగతా పంటల్లాగే పసుపు పంటకు కేంద్రం మద్దతు ధర ప్రకటించాలి.
– కూల్ల యాకయ్య, కొమ్ములవంచ
సస్యరక్షణతో మంచి దిగుబడి
పసుపు సాగు చేసే ముందు ఎకరానికి 10 నుంచి 15 టన్నుల పశువుల ఎరువు వేయాలి. చివరి దుక్కిలో 200 కిలోల వేపపిండి, నాటిన 40 రోజుల వరకు ఎకరానికి 50 కిలోల యూరియా, 200 కిలోల వేపపిండి వేయాలి. విత్తనశుద్ధిదుంపకుళ్లును నివారించవచ్చు. విత్తనం వేసే ముందు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు, లేదా మోనోక్రోటోఫాస్ లీటర్ నీటికి 1.5 మి.లీ.లు కలిపి 30 నిమిషాల పాటు ద్రావణంలో పసుపు దుంపలను ఉంచిన తర్వాత విత్తుకోవాలి. తేమ లేనప్పుడు యూరి యా, పొటాష్ వేసుకోవాలి. లేకపోతే ఆకులపై పడి మాడిపోతాయి. అవసరాన్ని బట్టి నీటి తడులు ఇవ్వాలి.
– రామకృష్ణ, ఏఈవో