నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 3 ;కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి గ్యాస్ ధరను తగ్గించే వరకు పోరాటం ఆగదని బీఆర్ఎస్ నాయకులు, మహిళలు స్పష్టం చేశారు. శుక్రవారం రెండో రోజు గ్యాస్ ధర పెంపుపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులు, వామపక్ష నేతలు రోడ్లపైకి వచ్చి పోరుబాట పట్టారు. ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తించారు. ప్రధాని మోదీ దేశ సంపదను కార్పొరేట్లకు దోచి పెడుతున్నారని విమర్శించారు. నిత్యావసర సరుకులు, గ్యాస్ ధరను పెంచుకుంటూ పోతే సామాన్యులు బతికేదెలా? అని ప్రశ్నించారు. దేశంలో పేదల కష్టాలు కనిపించడం లేదా? అని నిలదీశారు. పలు చోట్ల కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం తప్పదని, బడుగు బలహీన వర్గాల సత్తా ఏమిటో చూపిస్తామని స్పష్టం చేశారు.
వంటగ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలంటూ రెండో రోజు సైతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు శుక్రవారం పట్టణాలతోపాటు మండలకేంద్రాల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు మహిళలతో కలిసి రోడ్డెక్కారు. ఖాళీ సిలిండర్లతో నిరసన తెలిపారు. కట్టెలపొయ్యిలు పెట్టి వంటావార్పు చేపట్టారు. కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మోదీ.. డౌన్..డౌన్ అంటూ నినాదాలు చేశారు. గ్యాస్ ధరలు పెంచి వంటింట్లో మంట పెట్టిన ప్రధాని మోదీకి తమ ఉసురు తగులుద్దంటూ మహిళలు శాపనార్థాలు పెట్టారు. వెంటనే ధరలు తగ్గించకపోతే ఉద్యమం ఆపేది లేదని స్పష్టం చేశారు. హనుమకొండ చౌరస్తాలో నిర్వహించిన వంటావార్పులో చీఫ్విప్ వినయ్భాస్కర్, మేయర్ గుండు సుధారాణి స్థానిక మహిళలతో కలిసి వంటావార్పు చేశారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ హసన్పర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పరకాల ప్రధాన రహదారిపై నిర్వహించిన వంటావార్పులో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. జనగామ జిల్లా నర్మెట, రఘునాథపల్లి, పాలకుర్తి, జఫర్గఢ్, కొడకండ్ల మండల కేంద్రాల్లో ప్రధాని మోదీ దిష్టిబ్మొలను దహనం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మహిళలతో కలిసి కట్టెలమోపుతో ర్యాలీ నిర్వహించి, వంటావార్పు చేపట్టారు. వరంగల్ చౌరస్తాలో తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వరంగల్ జేపీఎన్ రోడ్డులో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజనాల శ్రీహరి గ్యాస్ సిలిండర్ను ఉరితీసి, పాడెకట్టి వినూత్నంగా నిరసన తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మున్సిపల్ కేంద్రంలో వంటగ్యాస్ ధర తగ్గించాలంటూ చేపట్టిన వంటావార్పు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ కవిత పాల్గొన్నారు. అలాగే డోర్నకల్ మున్సిపల్ కేంద్రంలోని గాంధీ సెంటర్లో ఎమ్మెల్యే రెడ్యానాయక్ స్థానిక మహిళలు, నాయకులు కలిసి ఖాళీ సిలిండర్లతో నిరసన తెపారు. రోడ్డుపై కట్టెలపొయ్యి పెట్టి వంటవార్పు చేపట్టారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.