వరంగల్, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రతి ఎకరాకు సాగునీరు అందించే రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణలో మరో అడుగుముందుకు పడింది. గోదావరి నదికి సమీపాన అటవీ ప్రాంతాల్లోని 63 గ్రామాలకు తాగునీరు, సాగునీటి అవసరాలను తీర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తయారుచేసిన ముక్తీశ్వర (చిన్న కాళేశ్వరం) సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర జలసంఘం ఈ మేరకు నిర్ణ యం తీసుకున్నది. దీంతో ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తయ్యేందుకు మార్గం సుగమమైంది.
ముక్తీశ్వర ప్రాజెక్టును గోదావరి రివర్ మేనేజ్మెంట్బోర్డు(జీఆర్ఎంబీ)లో చేర్చు తూ కేంద్ర ప్రభుత్వం గత జూలైలో నిర్ణయం తీసుకున్నది. దీన్ని అనుమతి లేని ప్రాజెక్టుల జాబితాలో చేర్చింది. అనంతరం ముక్తీశ్వర ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. ఏప్రిల్లో జరిగిన కేంద్ర జలసంఘం సమావేశంలో ముక్తీశ్వర ప్రాజెక్టు డీపీఆర్పై చర్చించింది. కేంద్ర జలసంఘం నిర్వహించిన ప్రతి సమావేశంలోనూ ముక్తీశ్వర ప్రాజెక్టుకు అనుమతులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. కేంద్ర జలసంఘం ప్రస్తావించిన ప్రతి అంశంపై స్పష్టత ఇచ్చింది. ముక్తీశ్వర ప్రాజెక్టు పూర్తిగా నిబంధనల మేరకు నిర్మిస్తున్న అంశాలను వివరించింది. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను తెలిపింది. అటవీ ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించే అంశాలను వివరించింది. రాష్ట్ర ప్రభుత్వ పకడ్బందీ కార్యాచరణ, డీపీఆర్లో పొందుపరిచిన అంశాలపై కేంద్ర జలసంఘం సంతృప్తి వ్యక్తం చేసింది. ముక్తీశ్వర ఎత్తిపోతల డీపీఆర్ మార్గదర్శకాల మేరకు ఉండడంతో ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం బీరసాగర్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ముక్తీశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టింది. తాగునీరు, సాగునీరు అవసరాలను తీర్చేలా దీన్ని రూపొందించింది. 4.5 టీఎంసీలను ఎత్తిపోసే సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుతో ఎత్తిపోసే నీటిలో 4.20 టీఎంసీలు సాగునీటికి, 0.3 టీఎంసీలు ఈ ప్రాంతంలోని ఆవాసాల తాగునీటి అవసరాలకు వినియోగించనున్నారు. మహదేవపూర్, కాటా రం, మహాముత్తారం, మల్హర్ మండలంలోని 11 చెరువులకు ఈ ప్రాజెక్టుతో నీరు అందుతుంది. 45,527 ఎకరాలకు సాగునీరు అందించేలా లక్ష్యంతో ముక్తీశ్వర ప్రాజెక్టును రూపొందించారు. 63 గ్రామాల తాగునీటి అవసరాలను తీర్చనున్నది. గ్రావిటీతోనే నీటి సరఫరా అయ్యేలా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.545 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించింది. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 3,667 ఎకరాలు అవసరమవుతున్నది. వీటిలో 1,412 ఎకరాలు ప్రభుత్వ భూమి, 645 ఎకరాలు అటవీ భూమి, 1,600 ఎకరాల ప్రైవేట్ భూమి ఉన్నది. ఎలాంటి ముంపు ప్రాంతం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు డిజైన్ చేసింది. ప్రాజెక్టు నిర్వహణ కోసం 29 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుంది.