నర్సంపేట, జూన్ 9: తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ పాలన స్వర్ణయుగమని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో శుక్రవారం తెలంగాణ సంక్షేమ సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గొల్లకురుమలకు గొర్రెలు, మహిళలకు కుట్టుమిషన్లు, చేతివృత్తి పనివారలకు ఆర్థిక సాయం, లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు, పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా మంత్రి హాజరై మాట్లాడుతూ సంక్షేమ రంగంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. ఆసరా పింఛన్లు, సంక్షేమ పథకాలకు ప్రభుత్వం రూ. 5 లక్షల కోట్లు వెచ్చిస్తున్నదన్నారు. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పింఛన్లకు రూ. 58,696 కోట్లు ఖర్చు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని వివరించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీల సంక్షేమానికి ప్రభుత్వం ఏటా రూ. 50 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని అన్నారు. అధికంగా గిరిజన జనాభా ఉన్న నర్సంపేట డివిజన్లో రూ. 63 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్ధాపన చేశామన్నారు. మా తండాలో.. మా రాజ్యం అనే గిరిజనుల చిరకాల ఆకాంక్షను సీఎం కేసీఆర్ నెరవేర్చారని కొనియాడారు. దీనివల్ల వేలాది మంది గిరిజన యువతీ యువకులు సర్పంచ్లుగా, ఉప సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా రాజకీయాధికారంలో భాగమయ్యారని వివరించారు.
గిరిజనుల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసినట్లు మంత్రి సత్యవతి తెలిపారు. గిరిజనుల రిజర్వేషన్లు 10 శాతానికి పెంచడంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయని వివరించారు. దీనివల్ల గిరిజన ఉద్యోగులు, అధికారులు ప్రమోషన్లు కూడా పొందారన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు గిరిజనులను గతంలో కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 93 గురుకుల విద్యాలయాలు నెలకొల్పిందన్నారు. మరో మూడు గురుకులాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటిలో రెసిడెన్షియల్, డిగ్రీ కాలేజీలు, ఫైన్ ఆర్ట్స్ కాలేజీలు, లా కాలేజీలు, సైనిక్స్కూల్స్ కాలేజీ ఆఫ్ ఎక్స్లెన్స్ ఉన్నాయన్నారు. ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి, ఉచితంగా కరెంట్ అందించి సీఎం కేసీఆర్ నేడు వ్యవయాన్ని పండుగగా చేశారన్నారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం కొద్ది రోజుల్లో గ్రామాల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సంపేటలో ఇరిగేషన్ సర్క్యూట్ను అమలు చేసినట్లు చెప్పారు. మున్నేరు, పాకాలు, వట్టెవాగులపై 13 చెక్డ్యామ్లు నిర్మించామన్నారు. దీనివల్ల ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగినట్లు వెల్లడించారు. మూడెకరాల భూమి పంపిణీలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో భూ పంపిణీ పూర్తి చేశామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం నర్సంపేట నియోజకవర్గంలో లబ్ధిదారులకు చేరుతున్నదన్నారు. నియోజకవర్గంలో 2014కు ముందు పింఛన్లు రూ. 80 లక్షలు కేటాయించే వారని, ఇప్పుడు రూ. 9 కోట్లు వస్తున్నాయని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో నర్సంపేట ముందున్నదన్నారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న, ఎంపీపీలు ఊడుగులు సునీత, వేములపెల్లి ప్రకాశ్రావు, విజేందర్, రమేశ్, కాట్ల కోమల, జడ్పీటీసీలు పత్తినాయక్, బత్తిని స్వప్న, ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్ రామ్మూర్తి, అధికారులు పాల్గొన్నారు.