అభివృద్ధి పనులను పెండింగ్లో పెట్టొద్దని, త్వరగా పూర్తి చేయాలని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖ, పోడు పట్టాల జారీపై ఆమె సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో రోడ్ల మరమ్మతు పనులకు నిధులు మంజూరయ్యాయని, వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. ఇంకా నిధులు మంజూరుకాని రోడ్ల వివరాలను అందించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందిపడకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, వడ్లు కొన్న వెంటనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోడు పట్టాల జారీకి సంబంధించి త్వరగా క్లెయిమ్ చేయాలన్నారు.
మహబూబాబాద్ రూరల్, డిసెంబర్ 12 : ఏజెన్సీ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమశాఖ, పోడు పట్టాల జారీపై కలెక్టర్ శశాంక అధ్యక్షతన నిర్వహించిన సమీక్షలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీల్లో డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపాలన్నారు.
మానుకోట పట్టణంలోని మూడుకోట్ల జంక్షన్, జ్యోతిరావు ఫూలే, వైఎస్సార్ జంక్షన్లను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. డోర్నకల్ రోడ్ల మరమ్మతుకు రూ.42.60కోట్లు మంజూరయ్యాయని, వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. నిధులు మంజూరుగాని రోడ్ల వివరాలను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇల్లందు నుంచి పాకాల వెళ్లే రహదారి, బ్రిడ్జి నిర్మాణాలను త్వరగా చేపట్టాలన్నారు. కురవి నుంచి జంగిలికొండ, గార్ల, రాంపురం బ్రిడ్జ్జి, భూపతిపేట నుంచి కొత్తగూడ వెళ్లే రహదారిలో బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా చేపట్టాలన్నారు. వాణిజ్య పంటల సాగుపై రైతులను ప్రోత్సహించాలని సూచించారు.
పోడు భూములపై అధికారులతో సమీక్షించి త్వరగా దరఖాస్తులను పరిశీలించాలన్నారు. అర్హులకు న్యాయంగ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 173 సబ్ సెంటర్లలో 64 సబ్సెంటర్లకు ప్రభుత్వ భవనాలున్నాయని, మిగిలిన వాటిలో 74 సబ్సెంటర్ల భవన నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయని వెంటనే పనులు చేపట్టాలన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు రూ.132కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశామని, ఇందులో రూ.65కోట్లు ఆన్లైన్ చేశామని, వాటిలో రూ.24 కోట్లు రైతు ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు.
ధాన్యం రవాణాకు లారీలతోపాటు ట్రాక్టర్లను కూడా వినియోగించాలని సూచించారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు భూముల ైక్లెయిమ్ త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఎమ్మెల్యే శంకర్నాయక్ మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో భారీగా రోడ్లు మరమ్మతులు ఉన్నాయని, వెంటనే చేపట్టాలన్నారు. ప్రధానంగా చిన్ననాగారం, ఎర్రబెల్లిగూడెం, పోకలతండా రోడ్డు మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలన్నారు. తండాలు, గ్రామాల్లో మిషన్ భగీరథ ట్రయల్ రన్ నిర్వహించాలని, సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అభిలాషాఅభినవ్, డేవిడ్, జడ్పీ సీఈవో రమాదేవి, ఇంజినీరింగ్ అధికారులు తానేశ్వర్, సురేశ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.