సుబేదారి, ఏప్రిల్ 4 : తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక బోర్డు ఆధ్వర్యంలో ఈనెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ట్రైనీ ఇన్స్పెక్టర్ (సివిల్, ఎస్ఐఐటీ, కమ్యూనికేషన్స్ ,పోలీసు ట్రాన్స్పోర్ట్, ఫింగర్ ప్రింట్ ఏఎస్సై పోస్టుల) తుది రాత పరీక్షకు అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించొద్దని వరంగల్ పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ట్రైనీ ఎస్సై పరీక్షల నిర్వహణపై పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ట్రైనీ ఎస్సై తుది రాత పరీక్షలకు 21 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 10 గంటల నుంచి మద్యాహ్నం ఒంటి గంట వరకు , 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందన్నారు.
ఈ పరీక్షకు 14,380 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు, వీరిలో 3,315 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారని సీపీ తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు. పోలీసు నియామక బోర్డు జారీ చేసిన రాత పరీక్షకు బ్లాక్ లేదా, బ్లూ బాల్పయింట్ పెన్ను తెచ్చుకోవాలన్నారు. సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరిక్షరాలు, బ్యాగులు వెంట తీసుకురావొద్దన్నారు. ఇన్విజిలేటర్లు అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు పద్ధతిపై శిక్షణ ఇవ్వాలని సీపీ అధికారులకు సూచించారు. ఇన్విజిలేటర్ల సెల్ఫోన్లకు అనుమతి లేదన్నారు. మీడియా ప్రతినిధులకు అనుమతి లేదని సీపీ తెలిపారు. ఈ సమావేశంలో క్రైమ్ డీసీపీ మురళీధర్, ఈస్ట్జోన్ డీసీపీ కరుణాకర్, రీజినల్ కోఆర్డినేటర్ ఆనంద్కిషోర్ కోల, ఆదనపు డీసీపీలు సంజీవ్కుమార్, సురేశ్కుమార్ పాల్గొన్నారు.