సుబేదారి, డిసెంబర్ 18: నగరంలో ట్రాఫిక్ సమస్య నియంత్రణకు పోలీస్ కమిషనర్ చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ను చక్కదిద్దిన అనుభవంతో వరంగల్లో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. జనవరి 1 నుంచి వరంగల్ కమిషనరేట్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేయనున్నారు. ఈ మేరకు వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు.
ట్రాఫిక్ సమస్యపై సీపీ నజర్..
ట్రాఫిక్ సమస్యపై కొత్త పోలీసు కమిషనర్ నజర్పెట్టారు. క్షేత్ర స్థాయిలో సమస్యలను తెలుసుకోవడానికి సీపీ ఏవీ రంగనాథ్ ఇటీవల అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ తరహాలో ట్రాఫిక్ఫ్రీ ఫ్లో చర్యలకు దిశానిర్దేశం చేశారు.
జంక్షన్ల వద్ద స్టాప్లైన్ దాటితే చర్యలు..
హైదరాబాద్ తరహాలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టారు. నగరంలోని ప్రధాన జంక్షన్లలో వాహనదారులు స్టాప్లైన్ దాటిపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. స్టాప్లైన్ దాటితే ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించనున్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనదారుల జరిమానా తప్పదు.
మార్జిన్ లైన్లలోనే పార్కింగ్..
రోడ్లకు చివరి భాగంలో మార్జిన్ లైన్లలో మాత్రమే వాహనాలను పార్కింగ్చేయాలి. మార్జిన్ లైన్లలో కాకుండా లైన్ లోపలికి వాహనం పార్కింగ్ చేస్తే ట్రాఫిక్ పోలీసులు జరిమానా వేస్తారు. బ్యాంకులు, కమర్షియల్ కాంప్లెక్స్లు, వైన్స్ల వద్ద ట్రాఫిక్ నియంత్రణ కోసం యాజమాన్యాలు సిబ్బందిని నియమించుకోవాలి.
హైదరాబాద్ తరహాలో ఆపరేషన్ రోప్..
హైదరాబాద్ తరహాలో నగరంలో ఆపరేషన్ రోప్ పద్ధతిని అమలుచేస్తారు. రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు చేసేవారిపై ట్రాఫిక్ ఉల్లంఘన చర్యలు తీసుకుంటారు. ఇక్కడ వాహనాలను పార్కింగ్చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఇందుకు వరంగల్ పోలీసు కమిషనరేట్ , గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సమన్వయంలో స్ట్రిక్ట్ ట్రాఫిక్ రూల్స్ అమలు చేయడానికి ముందుకు సాగుతున్నారు.
రోజుకు సగటున 5 లక్షల వాహనాలు..
హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద రెండో నగరమైన వరంగల్లో వాహనాల తాకిడి రోజురోజుకు పెరిగిపోతుంది. నగరంలో రోజుకు సగటున 5 లక్షల వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. వీటిలో 3.30 లక్షలకు పైగా బైక్లు, మిగిలినవి కార్లు, ఆటోలు, స్కూల్బస్సులు, ఆర్టీసీ బస్సులు, ఇతర పెద్ద వాహనాలు ఉన్నాయి. వరంగల్ జిల్లాలో 2,05,334 వాహనాలు, హనుమకొండలో 5,01,242 వాహనాలు ఉన్నాయి. వీటిలో రోజుకు సగటున 5 లక్షల వాహనాలు నగరంలో తిరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసు అధికారుల నివేదికలు చెబుతున్నాయి.
ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి
రోడ్లుపై ప్రతి ఒక్కరూ సాపీగా జర్నీ చేయడం మా లక్ష్యం. ఒకరు తప్పుచేయడం వలన చాలామంది ఇబ్బందిపడుతారు. వరంగల్ నగరంలో ట్రాఫిక్ సమస్యను నియంత్రించడానికి హైదరాబాద్ తరహాలో ఆపరేషన్ రోప్ పద్ధతిని అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ సమస్య ఉన్న ప్రాంతాలను పరిశీలించాం. కొన్నిచోట్ల అడ్డదిడ్డంగా వాహనాలు పార్కింగ్ చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. జంక్షన్ల వద్ల వాహనదారులు స్టాప్లైన్ దాటి రావడం, సిగ్నల్స్ పాటించకపోవడం, రాంగ్రూట్లో రావడం గమనించాం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి, ప్రధాన రోడ్లను ఆక్రమించి వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేసుకోవడంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు మాదృష్టికి వచ్చింది. వీటన్నింటిపై ఫోకస్ పెట్టాం, ప్రతి వాహనదారుడు పక్కగా ట్రాఫిక్ నిబంధనలు పాటించే విధంగా జనవరి 1 నుంచి చర్యలు తీసుకుంటున్నాం. ఆటోడ్రైవర్లు, వాహనదారులకు, వ్యాపారులకు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పిస్తున్నాం.
– ఏవీ రంగనాథ్, వరంగల్ పోలీసు కమిషనర్