జనగామ, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను విక్రయించేందుకు మార్కెట్కు తీసుకొచ్చిన రైతులు అరిగోస పడుతున్నారు. పండిన ప్రతి గింజకూ మద్దతు ధర అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలు నమ్మిన రైతుకు భంగపాటే మిగిలింది. జనగామ వ్యవసాయ మార్కెట్లో కొనేవాళ్లు లేక ఐదు రోజులుగా ధాన్యం, మక్కజొన్న రాశుల వద్ద రోజూ పిల్లా, పాపలతో సద్దులు కట్టుకొని వచ్చి పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన తీరుకు ఇది అద్దం పడుతున్నది. జనగామ మారెట్లో పంటల ఉత్పత్తుల కొనుగోళ్లపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఈనెల 10న మార్కెట్లో జరిగిన ఆందోళన నేపథ్యంలో ట్రేడర్లు కొనుగోళ్లకు దూరంగా ఉన్నారు. తమపై పెట్టిన చీటింగ్ కేసులను ఎత్తివేసి హమాలీల సమస్యను పరిషరించే వరకూ కొనుగోళ్లు జరుపబోమని భీష్మించారు. ధాన్యంతో పాటు మకలు, చింతపండు లాంటి ఇతర ఉత్పత్తుల కొనుగోళ్లను సైతం ట్రేడర్లు నిలిపివేశారు. ఎంఎస్పీకే కొనాలని, లేకుంటే చర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టం చేస్తుంటే.. లేదులేదు తేమ, తాలు శాతాన్ని పరిగణలోకి తీసుకొని ధర నిర్ణయిస్తామంటూ తెగేసి చెబుతున్నారు. దీంతో మార్కెట్లో ఐదురోజులుగా ధాన్యం, ఇతర ఉత్పత్తుల కొనుగోళ్లలో ప్రతిష్టంభన కొనసాగుతుండడంతో ఏం చేయాలో తెలియక అధికారులు తల పట్టుకుంటున్నారు. ఈనెల 11 నుంచి ఆదివారం వరకు జనగామ మారెట్కు నాలుగు రోజుల పాటు వరుసగా సెలవులు వచ్చాయి. సోమవారం మారెట్లో కొనుగోళ్లు జరగాల్సి ఉన్నా ట్రేడర్లు ముందుకు రాకపోవడంతో నిలిచిపోయాయి.
‘రైతు పండించిన ప్రతి గింజనూ మద్దతు ధరకే కొంటాం.. ధర తగ్గించే వారిపై కఠిన చర్యలు ఉంటాయ్’..ఇది ‘నమస్తే తెలంగాణ’ రెండు రోజులుగా వరుస కథనాలు ప్రచురించిన తర్వాత అధికారుల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ప్రకటన. కానీ వరుసగా ఐదోరోజూ సోమవారం జనగామ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం, మక్కల కొనుగోళ్లలో ప్రతిష్టంభన కొనసాగుతున్నది. సీఎం చెప్పినా.. మార్కెటింగ్, రెవెన్యూ, సహకార, పౌర సరఫరాల వంటి దాదాపు 50మంది జిల్లా అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తున్నా ధాన్యం, మక్కల కొనుగోళ్లలో అడుగు ముందుకు పడలేదు. దీంతో రైతులు, మహిళా రైతులు పిల్లాపాపలతో సద్దులు కట్టకొని వచ్చి యార్డులో పడిగాపులు కాస్తున్నారు.
ఇప్పటికే అమ్మకానికి తెచ్చిన దాదాపు 40 వేలకు పైగా ధాన్యం బస్తాలు మార్కెట్లో పేరుకుపోయాయి. సహకార సంఘం, ఐకేపీ, సివిల్ సైప్లె వంటి మూడు ప్రభుత్వరంగ కొనుగోలు కేంద్రాలను మార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేసినా వాటి ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలు రెండు వేలే. పాత నిల్వలు ఉండగానే ధాన్యం, మక్కలను రైతులు యార్డుకు తెస్తుండడంతో యార్డులో భారీగా పేరుకుపోతున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో జోక్యం చేసుకున్నా..మాయిశ్చర్ (తేమ), తాలు, మట్టి సాకుతో జనగామ మార్కెట్లో ప్రభుత్వరంగ సంస్థలు కొన్నది నామమాత్రమే. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొనుగోళ్ల కోసం ఎదురుచూసిన రైతులు కడుపుమండి ఆందోళనకు దిగారు. పలుమార్లు మార్కెట్ కార్యాలయంలోకి వెళ్లి మార్కెటింగ్ డిప్యూటీ డైరెక్టర్ రాజూనాయక్, జిల్లా మార్కెటింగ్ అధికారి నరేంద్ర, ఆర్డీవో కొమురయ్య, కార్యదర్శి శ్రీనివాస్ను నిలదీశారు. అయితే అధికారులు మాత్రం నిబంధనల ప్రకారం తేమ, తాలు లేకుండా ఉన్న ధాన్యానికి మాత్రమే మద్దతు ధర దక్కుతుందని, లేకుంటే రైతులు ఆరబెట్టుకునే వరకు కొనం అని స్పష్టం చేశారు.
మా ధాన్యం మక్కిబూజు పడుతున్నది.. ప్రైవేట్ ట్రేడర్లకు అమ్మేందుకు మేం సిద్ధం అని రైతులు స్పష్టం చేసినా.. యార్డులో మద్దతు ధరకు మాత్రమే కొనాలని పై నుంచి ఆదేశం.. బయటకు వెళ్లి మీరు ఎంతకైనా అమ్ముకోండి..అంటూ అధికారులు నర్మగర్భంగా బయటకు వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్న తీరుపై రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం మద్దతు చెల్లించి కొనదు.. మమ్మల్ని ప్రైవేట్కు అమ్ముకోనివ్వదు.. మేం ఎన్నిరోజులు మార్కెట్లో పస్తులతో పడిగాపులుండాలి..? అని ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు సోమవారం మార్కెట్ కార్యాలయంలోకి వెళ్లి తాళాలు వేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యాలయం ముందు ఎండుగడ్డి, చెత్తను పోగేసి మంటపెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా కలెక్టర్ వచ్చి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
మద్దతు ధర ఇస్తమంటే మార్కెట్కు వడ్లు తెచ్చిన.. పచ్చిగున్నయ్ అంటే ఐదు రోజుల నుంచి ఎండబెడుతున్న అయినా కొంటలేరు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతుకు ఇంత అన్యాయం జరగలేదు. వడ్లు కొనేది..రైతుబంధు వెంటనే పడేది.. పింఛన్ల్లు వచ్చేవి..ఇప్పుడు ఏదీ లేదు..రేవంత్రెడ్డి రైతు భరోసా పెంచుత అన్నడు..ఆడోళ్లకు రూ. 2500 అన్నడు..పింఛన్లు పంచుతా అన్నడు..కరువు పైసలు మూడునెలల నుంచి రూపాయి రాలేదు. గత ప్రభుత్వంలో వారంకోసారి డబ్బులు పడేది. ఉప్పులు, పప్పులు తెచ్చుకొని..ఇంట్లో ఎల్లదీసుకొని చిట్టీలు కట్టుకునేది. వడ్లు కొంటలేడు..ఇంక బోనసా..? వాని ముఖం ఇస్తడు. చెరువులకు నీళ్లు వస్తలే వు..నీళ్లు రానిది పొలాలు ఎట్లా పండుతాయ్..జైలుకైనా పోతం కాని ఈ కష్టం భరించలేం..మళ్లీ కేసీఆర్కే ఓటేస్తాం..