కాశీబుగ్గ, సెప్టెంబర్ 20: రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ వ్యాపారులు ఆర్థికంగా ఎదగాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాల్లో భాగంగా వరంగల్ ఓసిటీ స్టేడియంలో అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం క్రీడాపోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సీపీ రంగనాథ్, కలెక్టర్ ప్రావీణ్య హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు.
అనంతరం సీపీ మాట్లాడుతూ వ్యాపారులు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు స్థాపించి, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఐదో స్థానంలో ఉందన్నారు. ప్రస్తుతం స్టాక్, మనీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనలో ఊపందుకుంటుందన్నారు. నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా వ్యాపార రంగంలో రాణించాలని సూచించారు. 75 ఏళ్ల క్రితం స్థాపించిన చాంబర్ ఐక్యతతో దినదినాభివృద్ధి చెంది వజ్రోత్సవాలు జరుపుకోవడం అభినందనీయమన్నారు.
వ్యాపారులు అన్నదాతలకు మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా పీపీ కోరారు. కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ చాంబర్ వ్యాపారుల సేవలకే అంకితం కాకుండా వ్యవసాయదారులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కీలక పాత్ర వహించాలన్నారు. అనంతరం సీపీ, కలెక్టర్ను చాంబర్ కార్యవర్గం ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో చాంబర్ మాజీ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి, కటకం పెంటయ్య, కంభంపాటి కుమారస్వామి, చాంబర్ ఉపాధ్యక్షుడు మొగిలి చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి మడూరి వేదప్రకాశ్, కోశాధికారి అల్లె సంపత్, సంయుక్త కార్యదర్శి సాగర్ల శ్రీనివాస్, గోరంటల యాదగిరి, తోట నర్సింహారావు, కరాని స్పైసెస్ యజమాని రవి కరాని, సభ్యులు కైలాస హరినాథ్, సుదాటి రాజేశ్వరరావు, గాజుల సుమన్, కంచ సంపత్, గౌరిశెట్టి శ్రీనివాస్, రాయిశెట్టి సత్యనారాయణ, భూపతి ప్రభాకర్, వెల్ది చక్రధర్, పుప్పాల యుగేంధర్ తదితరులు పాల్గొన్నారు.