రామప్ప ఆలయం ఆదివారం పర్యాటకులు, విద్యార్థులు, భక్తులతో సందడిగా మారింది. ఆలయ పూజారులు హరీశ్శర్మ, ఉమాశంకర్ పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ చరిత్ర, విశిష్టతను టూరిజం గైడ్స్ వివరించగా ఆసక్తిగా విన్నారు. అనంతరం రామప్ప సరస్సులో బోటింగ్ చేసి ఆహ్లాదంగా గడిపారు. అలాగే గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సందర్శనకు పర్యాటకులు పోటెత్తారు. మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న అనంతరం తిరుగు ప్రయాణంలో పర్యాటకులు లక్నవరం సందర్శనకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పెద్ద బోటు ఒక్కటే పర్యాటక శాఖ నడుపుతుండడంతో స్పీడ్ బోటులో షికారు చేయాలనుకునే పర్యాటకులు నిరాశగా వెనుదిరిగారు.