సమైక్యపాలనలో చాలీచాలని గదుల్లో సింగరేణి కార్మికులు పడ్డ కష్టాలు అన్నీఇన్నీ కావు. నిలువ నీడ లేక అరిగోసపడుతూ బంకర్ల కింద కాలం వెళ్లదీసేది. ఆ తర్వాత నిర్మించిన బ్యారక్లు పశువుల కొట్టాలను తలపించేవి. క్వార్టర్లు సైతం సింగిల్ బెడ్రూంతో భార్యాభర్తలు ఉండడానికే సరిపోయేది. పిల్లలు ఉంటే సతమతమే. ఇక తల్లిదండ్రులతో కలిసి ఉన్న కుటుంబమైతే వారి ఇబ్బందులు వర్ణనాతీతం. తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి తెలంగాణ ఉద్యమ రథసారథి, నేటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సింగరేణి కార్మికుల కష్టాలను దగ్గరగా చూసి చలించిపోయారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కార్మికుల కోసం సింగరేణి చరిత్రలోనే ప్రప్రథమంగా భూపాలపల్లి, సత్తుపల్లి ఏరియాల్లో అత్యంత అధునాతన సౌకర్యాలతో డబుల్ బెడ్రూం క్వార్టర్లను నిర్మించి అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఒకప్పుడు ఎడారిని తలపించిన భూపాలపల్లిలోని యైటింక్లయిన్ రోడ్డు ప్రాంతం.. ఇప్పుడు ఏకంగా 994 క్వార్టర్లతో ఏర్పడిన డబుల్ సముదాయం(రామప్ప కాలనీ) కార్మికుల్లో సంతోషం నింపుతున్నది.
– జయశంకర్ భూపాలపల్లి, జూన్ 25 (నమస్తే తెలంగాణ)
భూపాలపల్లి ఏరియాలోని కేటీకే యైటిైంక్లెన్ రోడ్డులో ఉన్న స్థలం ఒకప్పడు ఎడారిని తలపించేది. అక్కడ నివాస వసతి లేక అద్దె ఇండ్లలో అరకొర సౌకర్యాలతో కాలం వెళ్లదీస్తున్న సింగరేణి కార్మికు లు పడుతున్న ఇబ్బందులను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. నాడు కార్మికుల నివా స వసతి లేమి కష్టాలను దగ్గరగా పరిశీలించిన సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి భూపాలపల్లి ఏరియాలో డబుల్ బెడ్రూం క్వా ర్టర్లను నిర్మించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ఆదేశాలతో 994 డబుల్ బెడ్రూం క్వార్టర్ల నిర్మాణానికి రూ.229 కోట్లు కేటాయిస్తూ సింగరేణి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పరిపాలనా అనుమతికి ఆమోదం తెలి పింది. 2020 ఆగస్టు 7న అవార్డు కాగా, ఇదే సంవ త్సరం ఆగస్టు 31న 994 డబుల్ నిర్మాణ పనులను యాజమాన్యం ప్రారంభించింది. ఈ డబుల్ బెడ్రూం క్వార్టర్ల సముదాయానికి రామప్ప కాల నీగా నామకరణం చేసింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 23న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు డబుల్ బెడ్రూం క్వార్టర్ల సముదాయా న్ని ప్రారంభించారు.
భూపాలపల్లిలోని సింగరేణి డబుల్ బెడ్రూం క్వార్టర్ల సముదాయంలో అధునాతన సౌకర్యాలు కల్పించారు. సమైక్య పాలనలో నిర్మించిన సింగిల్ బెడ్రూం క్వార్టర్ 450 స్కేర్ ఫీట్లు, ప్లింత్ ఏరియాలో ఒక సింగిల్ బెడ్రూం, ఒక హాల్, వంట గది మాత్రమే ఉండేవి. మెట్ల సౌకర్యం లేదు. కానీ స్వరాష్ట్రంలో కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్రూం క్వార్టర్లలో రెండు బెడ్రూంలు, గ్రానైట్తో మెట్ల నిర్మాణం, కిచెన్ ప్లాట్ ఫారం, స్టీల్ రెయిలింగ్, విట్రిఫైడ్ టైల్స్ ఫ్లోరింగ్, యూరేపియన్ వాటర్ కోజెట్(ఐడబ్ల్యూసీ), ఇండియన్ వాటర్ కోజెట్(ఐడబ్ల్యూసీ), ఇలా అధునాతన సౌకర్యాలతో 708 స్కేయర్ ఫీట్స్ ప్లింత్ ఏరియా, 963 స్కేర్ ఫీట్స్ బిల్డప్ ఏరియా కలిగి ఉన్నాయి. ఈ క్వార్టర్లు ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాయి.
డబుల్ క్వార్టర్ల కోసం కార్మికులు పోటీపడ్డారు. కొన్నింటిని బెటర్మెంట్ కింద సీనియర్లకు(ఇదివరకే క్వార్టర్లలో ఉంటున్న వారు), ఇప్పటివరకు అసలే క్వార్టర్లు లేని వారికి కేటాయించింది. క్వార్టర్ల కౌన్సెలింగ్ సందర్భంగా సీనియర్ కార్మికులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. అంటే ఎంత సౌకర్యవంతంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్రూం క్వార్టర్లను ఎక్కువగా అసలే క్వార్టర్లు లేని కార్మికులకు యాజమాన్యం కేటాయించింది. కాగా క్వార్టర్ల సౌకర్యాన్ని చూసి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు మురిసిపోతున్నారు. ఇటీవల కొంతమంది గృహ ప్రవేశం కూడా చేశారు. శ్రావణమాసంలో మొత్తం 994 క్వార్టర్లలో కార్మిక కుటుంబాలు నివాసం ఉండనున్నాయి. దీంతో రామప్పకాలనీ కళకళలాడనున్నది. ఇలా స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చొరవతో సింగరేణి కార్మికుల డబుల్ బెడ్రూం కల నెరవేరింది.