మహబూబాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : ఈ క్షణాన్ని ఆస్వాదించేలోపే మరుక్షణం మాయమవుతుంది.. ఇలాంటి కాలగమనంలో ఎన్నో జ్ఞాపకాలను ఒడిసిపట్టి, భద్రంగా బంధించి ఉంచేదే ఫొటో! కోట్ల పదాలతో వర్ణించలేని భావాన్ని ఒక్క ఫొటో కళ్లగడుతుంది. అక్షర, శబ్దాల కన్నా అత్యంత శక్తిమంతమైన దృశ్యం.. మనో ఫలకంపై చెదరని ముద్ర వేస్తుంది. కరుణ, భక్తి, హాస్యం, రౌద్రం, శాంతం, బీభత్సం, భయానకం, శృంగార, వీర రసాలకు ‘చిత్ర’మే అద్దం పడుతుంది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఫొటోగ్రఫీలో ఆది నుంచి నేటి ఆధునిక సమాజం వరకు ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. అత్యాధునిక కెమెరా ఫీచర్లు కలిగి ఉన్న సెల్ఫోన్లతో ప్రస్తుత ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఫొటోగ్రాఫర్లే అనడంలో అతిశయోక్తి లేదు..
బీటలు వారిన బురుజులైతేనేం.. జీవంలేని కోటలైతేనేం.. చలనం లేని శిల్పాలైతేనేం.. ఒక్క ఫొటో వాటిని సరికొత్తగా సాక్షాత్కరింపజేస్తుంది. అందమైన జ్ఞాపకాలు, అనుభూతులు, మధుర ఘట్టాలు, గొప్ప సన్నివేశాలు, వెలకట్టలేని ముగ్ధ మనోహర, ప్రకృతి రమణీయ దృశ్యాలను పది కాలాల పాటు పదిలంగా ఉంచుతుంది. కాలగర్భంలో కలిసిన చరిత్రను కూడా సజీవంగా నిలుపుతుంది. ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్తో ప్రారంభమైన ఫొటోగ్రఫీ నేడు అత్యాధునిక ఫీచర్లతో కూడిన కెమెరాలతో విప్లవాత్మక మార్పులు చెందింది. కొన్ని కిలోమీటర్ల పరిధిలోని కోట్లాది పిక్సెల్స్ను బంధించి చిత్రంగా మన ముందుంచే అత్యాధునిక కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి.
ప్రకృతి, చారిత్రక సంపదకు నెలవు ఓరుగల్లు
ఉమ్మడి జిల్లాలో ఎన్నో పర్యాటక కేంద్రాలున్నాయి. మైమరపించే ప్రకృతి రమణీయ ప్రదేశాలే కాకుండా, చారిత్రక సంపదను కలిగి ఉన్న ఓరుగల్లు.. ఫొటోగ్రాఫర్లకు స్వర్గధామంలా నిలిచింది. వరంగల్ కోట, రామప్ప ఆలయం, వేయిస్తంభాల గుడి, లక్నవరం, పాకాల సరస్సులు, ములుగు జిల్లాలో అటవీప్రాంతం, ఇతర చారిత్రక కట్టడాలు ఫొటోగ్రఫీకి అనుకూలంగా ఉన్నాయి.
ప్రతి ఒక్కరూ ఫొటోగ్రాఫరే..
ప్రస్తుతం సెల్ఫోన్ లేని మనిషి లేడంటే అతిశయోక్తి కాదు.. ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా అత్యాధునిక కెమెరా ఫీచర్లతో కూడిన సెల్ఫోన్లు ఉంటున్నాయి. ఎవరికి ఏ చిన్న తీరిక దొరికినా సెల్ఫీలతోనే గడుపుతున్నారు. శుభకార్యాలతో పాటు విహార యాత్రలకు వెళ్లిన సందర్భాలను ఫొటోలతో భద్రంగా దాచుకుంటున్నారు. తాము తీసుకున్న మధుర జ్ఞాపకాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ మిత్రులతో పంచుకుంటూ మురిసిపోతున్నారు.
గతంతో పోలిస్తే ఫుల్ డిమాండ్
ప్రస్తుతం ఇంట్లో ఏ చిన్న శుభకార్యమైనా ఫొటో, వీడియోగ్రఫీ తప్పక ఉండాల్సిందే. ఇక పెళ్లిళ్ల షూటింగ్ అయితే ఇప్పుడు ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. భారీ క్రేన్లు, డ్రోన్లతో మరీ శుభకార్యాల ఫొటోలు తీస్తున్నారు. స్థోమతను బట్టి ఇప్పుడు వేలు, లక్షల్లో వెచ్చించి ఫొటోలు, వీడియో ఆల్బమ్లు తీయించుకుంటున్నారు. గతంలో పోలిస్తే ఫొటోగ్రఫీకి డిమాండ్ పెరిగింది. పెళ్లిళ్ల సీజన్లో ఫొటో, వీడియోగ్రాఫర్లు దొరకడం కూడా కష్టంగా మారింది. ఎంగేజ్మెంట్, మంగళ స్నానాలు, పెళ్లిళ్లు, ప్రీ వెడ్డింగ్ షూట్లు, రిసిప్షన్లు, పోస్ట్ వెడ్డింగ్లు, పుట్టిన రోజు, బేబీ షూట్లు, సినిమాటిక్ వీడియోలపై ప్రజల్లో మక్కువ పెరిగింది.
చరిత్రకు సాక్ష్యం..
చరిత్రకు సాక్షిగా, విజ్ఞానం, వినోదం ఇతర ఎన్నో రంగాల్లో ఫొటోగ్రఫీని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. మానవ జీవితాన్ని ఫొటోగ్రఫీ ఎంతో ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు ఎంతో అధునాతనమైన కెమెరాలు వచ్చాయి. మొదట్లో బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు మాత్రమే తీయగలిగేవారు. కాలక్రమేనా కలర్ ఫొటోగ్రఫీ ఎన్నో కొత్త పుంతలు తొక్కింది. ప్రతి సెల్ఫోన్ కెమెరాను కలిగి ఉంటుంది అంటే ఫొటోగ్రఫీ ఎంత అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు.
– ఉపేందర్ యాని, మహబూబాబాద్
ప్రతి ఫొటో.. ఓ జ్ఞాపకం
కరిగేకాలంలో చెదరని మధుర స్మృతులకు ప్రతిబింబాలు ఫొటోలు. ప్రతి ముఖ్య సన్నివేశాన్ని కెమెరాలో బంధించి, జీవితకాలం వాటిని పదిలంగా దాచుకుని, అలనాటి జ్ఞాపకాలను మళ్లీమళ్లీ తనివితీరా వీక్షించుకునే అవకాశాన్ని ఇచ్చే తీపిగుర్తులు. ఓ మాట వింటే కొన్నాళ్లకు మర్చిపోతాం. ఓ పదం చదివితే ఇంకొన్నాళ్లకు మరుగున పడుతుంది. కానీ ఓ ఫొటో ఎంతోకాలాన్ని మదిలో ముద్ర వేస్తుంది. ప్రతి ఫొటో వెనుక ఓ జ్ఞాపకం, ఓ కథ, ఓ అనుభూతి దాగుంటుంది. ఇంతటి తీయని గుర్తుల ముద్రలు వేసే ఈ ఫొటోగ్రఫీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఓ రోజు ఉంది.
– తోట సుభాష్, మహబూబాబాద్