దేవరుప్పుల, జనవరి 2 : మండలంలోని కోలుకొండలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోనగిరి యాకస్వామిపై ఆదివారం రాత్రి దాడికి పాల్పడిన ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్సై మునావత్ రమేశ్ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను సోమవారం ఆయన విలేకరులకు వివరించారు. మండలంలోని కోలుకొండ గ్రామానికి చెందిన బోనగిరి సోమరాజ్కు ఇదే గ్రామానికి చెందిన గనుపాక స్వామికి మధ్య ప్లాట్ వివాదం ఉంది. సోదరుడైన బోనగిరి యాకస్వామి తనకు సహకరించకపోగా తన ప్రత్యర్ధికి సహకరిస్తున్నాడన్న కోపంతో ఈ దాడి చేశారని ఆయన తెలిపారు.
బోనగిరి యాకస్వామి కోళ్లఫారంలోనే మద్యం సేవిస్తున్న బోనగిరి సోమరాజ్, బోనగిరి శివప్రసాద్, బోనగిరి మురళి ప్లాట్ వివాదం చర్చిస్తూ మాటామాటా పెరిగి యాకస్వామిపై సీసాలతో దాడిచేసి గాయపరిచారని ఎస్సై రమేశ్ వివరించారు. ఈ ఘటనలో అదే రాత్రి యాకస్వామిని చికిత్స నిమిత్తం జనగామలోని ఏరియా దవఖానకు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దాడి చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేశ్ విలేకరులకు తెలిపారు