వర్ధన్నపేట/గిర్మాజీపేట, నవంబర్ 8 : పలు కుటుంబాల్లో వెలుగులు నింపిన ఇల్లూరి కృష్ణారెడ్డి ఇల్లు చీకటిమయమైంది. బిల్డర్గా స్థిరపడి ఎందరికో జీవనోపాధి కల్పించిన కృష్ణారెడ్డి కుటుంబం మాత్రం ఛిద్రమైంది. దైవ దర్శనానికి వెళ్లి వస్తూ 45నిమిషాల్లో ఇంటికి చేరుతాడనే క్రమంలోనే ఆగి ఉన్న లారీ ఆ కుటుంబాన్ని కబళించింది. మంగళవారం తెల్లవారుజామున వర్ధన్నపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పెరుకవాడకు చెందిన బిల్డర్ కృష్ణారెడ్డి, అతని భార్య వరలక్ష్మి, కుమారుడు వెంకటసాయిరెడ్డి అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. దీంతో పెరుకవాడలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు, బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా పామూరు మండలం శంకాపురం గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి(49) పాతికేళ్ల క్రితం వరంగల్కు వచ్చి మేస్త్రీ పనులు చేసుకుంటూ కష్టపడి బిల్డర్ స్థాయికి ఎదిగాడు. అతనికి భార్య వరలక్ష్మి(43), ఇద్దరు కూతుళ్లు హేమలత, తిరుమల, కుమారుడు వెంకటసాయిరెడ్డి (11) ఉన్నారు. పెద్దమ్మాయి హేమలత హైదరాబాద్లో హాస్టల్లో ఉంటూ బీటెక్ సెకండియర్ చదువుతోంది. చిన్నమ్మాయి తిరుమల 4వ తరగతి, కుమారుడు వెంకటసాయి గ్రీన్వుడ్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నారు.
మూడురోజుల కిందట శ్రీశైలంలోని మల్లిఖార్జునస్వామిని దర్శించుకోవడానికి కృష్ణారెడ్డి దంపతులు, కొడుకు వెంకటసాయిరెడ్డి, తన తమ్ముడు రవీందర్, లక్ష్మీదేవి, విజ్ఞాన్, శ్రీతన్రెడ్డి, హేమ, డ్రైవర్ రమేశ్తో మొత్తం తొమ్మిది మంది కలిసి ఇన్నోవాలో వెళ్లారు. దర్శన అనంతరం తమ సొంతూరు శంకరపట్నంలో అన్నదాన కార్యక్రమం చేసి సోమవారం రాత్రి 9గంటలకు బయలుదేరి వస్తున్న క్రమంలో వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీతండా వద్ద ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో కృష్ణారెడ్డి(49), అతని భార్య వరలక్ష్మి(43), కుమారుడు వెంకటసాయిరెడ్డి (11)లకు బలమైన గాయాలై తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే, వాహన డ్రైవర్ రమేశ్(31)తోపాటు వాహనంలో ఉన్న మృతుడు కృష్ణారెడ్డి సోదరుడు ఇల్లూరి రవీందర్రెడ్డి(35), ఇల్లూరి లక్ష్మీదేవి(28), శ్రీతన్రెడ్డి(4), విజ్ఞాన్రెడ్డి(7), హేమలతరెడ్డి(11)లకు గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న తండావాసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకునిపోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే స్థానిక ఎస్సై రామారావు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులతో పాటు మృతదేహాలను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కాగా క్షతగాత్రులు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. రహదారి పక్కనే ఎలాంటి పార్కింగ్ సిగ్నల్ లేకుండానే డ్రైవర్ లారీని ఆపడంతోపాటు తెల్లవారుజామున పొగమంచు కప్పడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానిక తండావాసులు చెప్పారు. కాగా, కృష్ణారెడ్డి పెరుకవాడలోని స్థానికుల తల్లో నాలుకలా ఉండేవాడని, సుమారు 200మంది కూలీలకు జీవనోపాధి కల్పిస్తున్నట్లు వారు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 12:30గంటలకు పెరుకవాడకు స్థానికుల సందర్శనార్థం మృతదేహాలను తీసుకొచ్చారు.
తన తల్లిదండ్రులు మరణించిన విషయం తెలియని చిన్న అమ్మాయి రోదిస్తున్న తీరు చూపరులను కంటనీరు పెట్టించాయి. కూలీలు కృష్ణారెడ్డి మృతిని జీర్ణించుకోలేక పోతున్నారు. అనాథలైన ఇద్దరు అమ్మాయిలను చూసి దేవుడు ఎంత అన్యాయం చేశాడంటూ స్థానిక మహిళలు, కూలీలు కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం బంధువులు దహనసంస్కారాలకు మృతదేహాలను అంబులెన్స్లో కృష్ణారెడ్డి సొంతూరు శంకాపురానికి తీసుకెళ్లారు. మృతుడు కృష్ణారెడ్డి సోదరుడు రవీందర్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామారావు తెలిపారు.