ధాన్యం కొనుగోలు కేంద్రాల తరహాలోనే మిర్చి రైతుల నుంచి దిగుబడులు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని ప్రధాన వ్యవసాయ మార్కెట్లలో అమలయ్యే ధరలను చెల్లించనున్నది. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో మిర్చికి మంచి డిమాండ్ ఉంది. వాణిజ్య పంటల్లో ప్రధానమైన ఎర్రబంగారానికి ప్రోత్సాహకం అందిస్తున్న సర్కారు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకున్నది. ఇందుకోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సహకారంతో రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసేందుకు సమాయత్తమైంది. జిల్లాలో ప్రయోగాత్మకంగా పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాలను ఎంపిక చేసింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
దేవరుప్పుల, జనవరి 2 : రైతులు పండించిన ధాన్యాన్ని నేరుగా సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం వారికి గిట్టుబాటు ధర చెల్లించి ఆదుకుంది. ఇదే తరహాలో మిర్చి పంటను సైతం కొనుగోలు కేంద్రాల ద్వారా తీసుకోనుంది. మధ్య దళారీల బారి నుంచి రైతులను కాపాడడంతోపాటు తక్కువ ధరకు అమ్మకుండా చర్యలు చేపడుతున్నది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్దాయి ధరలు పలుకుతున్న మిర్చి పంటను గ్రామాల్లోనే కొనుగోలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. రైతులు ఎక్కువగా వరి పంటపైనే ఆధారపడుతూ కూలీల కొరతతో ఇబ్బందిపడుతున్నందున ప్రత్యామ్నాయ పంటలవైపు ఆసక్తి చూపేలా ప్రోత్సాహం అందిస్తున్నది. ఈ క్రమంలో ఆయిల్పామ్ సాగు చేయాలని కోరుతూ ఉద్యానవన శాఖ ద్వారా సబ్సిడీలు ఇస్తున్నది. మార్కెట్లో మిరప పంటకు మంచి ధర ఉండడంతో రైతుల దృష్టిని ఇటువైపు మరల్చేలా చర్యలు చేపట్టారు. సెర్ప్( గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్ధ) గ్రామీణాభివృద్ధి శాఖతో రైతుల నుంచి నేరుగా తేజ మిర్చిని కొనుగోలు చేసేందుకు సమాయత్తమవుతున్నది.. ప్రయోగాత్మకంగా జిల్లాలోని పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాలను ఎంపిక చేసింది. ఈ సీజన్లో మిర్చిని కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.
వరంగల్ మార్కెట్ ధర గ్రామాల్లోనే..
సాధారణంగా ఉమ్మడి జిల్లాలో రైతులు పండించిన మిర్చి పంటను వరంగల్లోని మార్కెట్కు తరలించి అమ్ముకుంటారు. గ్రామాల్లో మిర్చి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కానుండడంతో వరంగల్ మార్కెట్ ధరను రైతులకు స్ధానికంగా చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రైతులు దూర ప్రాంతాల నుంచి వరంగల్ మార్కెట్కు మిర్చిని తరలిస్తే ఒక్కో క్వింటాల్కు రూ. 400 నుంచి 900 ఖర్చు వస్తుంది. ఇక ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న మిర్చి కొనుగోలు కేంద్రాలకు తరలిస్తే రూ. 150 ఖర్చు వస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. దీంతో రైతుకు క్వింటాల్కు సుమారు రూ.500 ఆదా అవుతుంది. ఈ సంవత్సరం కేవలం తేజా రకం మిర్చిని ఎంపిక చేసిన మండలాల్లో సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమైతే వచ్చే సంవత్సరం నుంచి మరిన్ని మండలాలకు విస్తరించి అన్ని రకాల మిర్చి పంటలను కొనుగోలు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు.
రైతుల నుంచి కొనుగోలు చేసేలా ఒప్పందం
మిర్చి పంటను రైతుల నుంచి కొనుగోలు చేసి మహబూబాబాద్ జిల్లా కురవిలోని లిపిడ్ మార్చి ప్లాంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు విక్రయించేందుకు సెర్ప్ ఒప్పందం కుదుర్చుకుంది. తేజ మిర్చి నుంచి ఆయిల్ తీసే కర్మాగారం కురవిలో నెలకొల్పి మిర్చి పంటను కొనుగోలు చేసుందుకు ముందుకొచ్చింది. గ్రామాణాభివృద్ది శాఖ ఇప్పటికే లిపిడ్ సంస్ధ ప్రతినిధులతో సమావేశమై స్ధానిక మహిళా ప్రతినిధులకు కొనుగోలు కేంద్రాల నిర్వహణ, సేకరణపై శిక్షణ నిప్పించారు. వీరు రైతుల కల్లాలకు వెళ్లి నాణ్యత, తేమ శాతంతో గ్రేడింగ్ చేయించి మిర్చికి చెల్లించే ధరను రైతుకు తెలియజేస్తారు. రైతులు సంతృప్తి చెందితే వెంటనే టోకెన్ అందించి మూడు రోజుల్లో స్ధానికంగా ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రానికి తరలించాలని సూచిస్తారు. అయితే రైతులకు చెల్లించే ధర ఆ రోజ వరంగల్ మార్కెట్లో ఉన్న ధరతో సమానంగా ఉంటుంది.
సాగును సర్వే చేసిన సెర్ప్ ప్రతినిధులు
పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లో మిర్చి సాగు విస్తీర్ణాన్ని సెర్ప్ అధికారులు ఇప్పటికే సర్వే చేశారు. రైతుల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. పాలకుర్తి మండలంలో 16 గ్రామపంచాయతీల పరిధిలో 304 మంది రైతులు 395 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ఇక్కడ 10 వేల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కొడకండ్లలో 10 గ్రామపంచాయతీల పరిధిలో 205 మంది రైతులు 255 ఎకరాల్లో సాగు చేయగా 5 వేల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా. దేవరుప్పుల మండలంలో 9 గ్రామపంచాయతీల పరిధిలో 90 మంది రైతులు మిర్చి సాగు చేయగా 2500 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. సాగును బట్టి ఆయా మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య ఉంటుందని సెర్ప్ అధికారులు తెలిపారు. సంక్రాంతి పండుగ అనంతరం ఆయా మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలనే యోచనలో జిల్లా గ్రామీణాభివృద్ది సంస్ధ అధికారులు ఉన్నారు.
రైతు సంక్షేమమే ధ్యేయం :మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి నుంచి రైతు సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్నది. సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిర్మించడంతో భూగర్బ జలా లు గణనీయంగా పెరిగా యి. వరి సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. కేంద్రం రైతులనుంచి ధాన్యం కొనుగోలు చేసే బాధ్యతను విస్మరించినా రాష్ట్ర ప్రభుత్వం వ్యయప్రయాసలకోర్చి ధాన్యం సేకరిస్తున్నది. రైతులకు లాభసాటిగా ఉండే పంటలపై రైతులు దృష్టి పెడితే వారి కుటుంబాలు ఆర్ధికంగా ఎదుగుతాయి. ఇందుకు వరికి ప్రత్యామ్నాయంగా ఇప్పటికే ఆయిల్పామ్ను ప్రభు త్వం ప్రోత్సహిస్తుండగా, అంతర్జాతీయంగా అత్యధిక రేటు పలుకుతున్న మిర్చిని సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నది. రైతుల సంక్షేమం కోసం మిర్చి కొనుగోలును చేపట్టింది. ప్రయోగాత్మకంగా పాలకుర్తి నియోజకవర్గంలోని మూడు మండలాలు ఎంపిక చేసింది.