ఇంటి గోడ ముగ్గురిని పొట్టన బెట్టుకొన్నది. వరుసగా కురుస్తున్న వానలకు హనుమకొండ జిల్లా శాయంపేటలో శుక్రవారం ఓ ఇంటి గోడ కూలి ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన మరో మహిళను దవాఖానకు తరలిస్తుండగా ప్రాణాలు విడిచింది. మరో ఐదుగురు బతికి బయట పడ్డారు. పింఛన్ తీసుకోడానికి సిరిసిల్ల నుంచి వచ్చిన పెద్దసాంబయ్య(60), మాందారిపేటకు చెందిన సారలక్ష్మి(55), స్థానికురాలు భోగి జోగమ్మ(65) కళ్ల ముందే కూలిన గోడ కింద నలిగి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. కాగా, బాధిత కుటుంబాలను వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు.
– శాయంపేట, సెప్టెంబర్ 22
శాయంపేట, సెప్టెంబర్ 22 : ఇంటి గోడ కూలి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన శాయంపేటలో శుక్రవారం జరిగింది. రోడ్డుపై వెళ్తుండగా ఒక్కసారిగా ఇంటి గోడ కూలి మీద పడడంతో మోరె పెద్దసాంబయ్య(60), లోకలబోయిన సారలక్ష్మి(55) అక్కడికక్కడే మృతిచెందగా గాయపడిన మరో మహిళ భోగి జోగమ్మ(65) ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. శాయంపేట పోచమ్మవాడలో సురేశ్కు చెందిన పాత ఇల్లు ఉన్నది. దీన్ని వదిలేసి అతడు తన భార్య భాగ్యతో పక్క ఇంటిలో ఉంటున్నాడు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు గోడలు నానిపోయి ఉన్నాయి. ఇదిలా ఉండగా, శాయంపేటకు చెందిన మోరె పెద్దసాంబయ్య సిరిసిల్లలో మరమగ్గాలు నడుపుతున్నాడు. నాలుగు రోజుల క్రితం పింఛన్ తీసుకునేందుకు ఇక్కడికి వచ్చాడు. శుక్రవారం స్థానిక గ్రామ పంచాయతీకి వెళ్లి పింఛన్ డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఇతడి భార్య, మనుమరాలు రోడ్డుపై మాట్లాడుతూ వస్తున్నారు. పింఛన్ విషయం తెలియడంతో సమీపంలో ఉంటున్న భోగి జోగమ్మ తీసుకునేందుకు సిద్ధమైంది. తన కూతురు, మనుమడు ఆటో తేవడంతో అందుబో బియ్యం సంచి వేసి వారితో మాట్లాడుతున్నది. మాందారిపేటకు చెందిన సారలక్ష్మి తన ఇల్లు కూలిపోవడంతో ఆర్నెళ్ల క్రితం శాయంపేటకు వచ్చి ఆద్దె ఇంట్లో ఉంటున్నది. ఆమె తనకు కూలి పని ఉంటే చెప్పాలని స్థానికురాలు సుభద్రతో మాట్లాడుతూ వస్తున్నది.
ఈ క్రమంలో హఠాత్తుగా ఇంటి గోడ కూలి వీరిపై పడింది. దీంతో మోరె సాంబయ్య, సారలక్ష్మి తలలు పగిలి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందారు. సాంబయ్య కుమారుడు అప్రమత్తమై గోడ ఇటుకలు తీసి చూడగా అప్పటికే అతడు మృతిచెందాడు. ఇంటి గోడ కూలుతుందని తీసేయాలని ముందే చెప్పామని, ఏదన్నా అయితే కట్టించుకుంటామని నిర్లక్ష్యంగా చెప్పారని సాంబయ్య కుమారుడు రోదిస్తూ చెప్పాడు. కాగా, గాయాలైన జోగమ్మను ఆస్పత్రికి వాహనంలో తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. రోడ్డుపై అందరితో మాట్లాడుతూ వెళ్తున్న సుభద్ర చూస్తుండగానే గోడ కూలుతుండగా అరిచి కాపాడే ప్రయత్నం చేసింది. వెంటనే సాంబయ్య భార్య, మనుమరాలు, పుషమ్మ, కలమ్మను పక్కకు తోసేయడంతో ఐదుగురు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఆటోలో ఉన్న ఇద్దరు ప్రమాదం నుంచి బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఆటో స్పల్పంగా ధ్వంసమైంది. కాయకష్టం చేసుకుని బతికే ముగ్గురు రెప్పపాటులో గోడ మీద పడి మృతి చెందడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. వరంగల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గండ్ర జ్యోతి ఘటనా స్థలాన్ని సందర్శించి మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి రూ.5వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. హనుమకొండ జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి న్యాయం చేయాలని కోరారు. ఆమె వెంట ఎంపీపీ తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మనోహర్రెడ్డి ఉన్నారు. ఎస్సై దేవేందర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.