నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 13 ;పుడమిపుత్రుల పండుగ.. సంబురాల సంక్రాంతి రానేవచ్చింది. నేడు భోగి, రేపు మకర సంక్రాంతి, ఎల్లుండి ‘కనుమ’ను కన్నుల పండువగా జరుపుకొనేందుకు ప్రతి ఇల్లూ ముస్తాబైంది. సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణంలోకి అడుగిడే సంక్రాంతికి ముందు రోజున ఇంట్లో పాత వస్తువులు భోగి మంటల్లో వేస్తే పీడ తొలుగుతుందనీ, చిన్నారులకు భోగిపండ్లు పోసి దిష్టి తీస్తే ఆయురారోగ్యాలతో ఉంటారనీ ప్రతీతి. కాగా, జిల్లాలోని పలు ఆలయాల్లో నేడు నిర్వహించే గోదారంగనాథస్వామి కల్యాణానికీ ఏర్పాట్లు పూర్తయ్యాయి.
మూడు రోజుల పండుగ..
సంక్రాంతి మూడు రోజుల వేడుక కాగా మొదటిరోజు భోగి. రెండో రోజు సంక్రాంతి. మూడోరోజు కనుమ నిర్వహించుకుంటారు. సూర్యుడి గమనానికి అనుగుణంగా జరుపుకొనే పండుగే సంక్రాంతి. హిందువుల ప్రతి పండుగలోనూ, చేసే పూజలోనూ ఏదో ఒక ఆంతర్యం దాగి ఉంటుంది. దక్షిణాయణం చివరి రోజుల్లో సూర్యుడు భూమికి దూరంగా ఉంటాడు. దీంతో సూర్యరశ్మి సరిగ్గా ఉండక, క్రిమికీటకాలు ప్రబలుతాయి. ఈ క్రమంలోనే గ్రామీణ ప్రాంత మహిళలు పేడతో ఇళ్లను అలికి, సున్నపు పిండితో ముగ్గులు వేస్తారు. వీటి ప్రభావంతో వ్యాధికారక క్రిమికీటకాలు నశిస్తాయి. ముగ్గుల మీద పేడ ముద్దలుంచి, వాటికి పసుపు కుంకుమలు పెట్టి వివిధ పూలతో అలంకరిస్తారు. ఇవే గొబ్బెమ్మలు. హరిదాసుల హరినామస్మరణ, గంగిరెద్దుల విన్యాసాలు, వైష్ణవాలయాల్లో విష్ణు సహస్ర నామ పారాయణాలు వినిపిస్తాయి. భోగి రోజు గోదాదేవి కల్యాణాన్ని కమనీయంగా జరుపుకొంటారు. మకర సంక్రాంతి పిండివంటలు చేసి, భుజిస్తారు. కనుమ రోజు మినుములతో గారెలు వండి, పెద్దలకు నైవేద్యం పెట్టడంతో పాటు పశువులను పూజిస్తారు.
గోదా కల్యాణం ఈ రోజే..
దక్షిణాయణం దేవతలు నిద్రించే కాలంగా చెప్పుకుంటారు. దీంతో సంక్రాంతికి ఒక రోజు ముందు పీడ నివారణ కోసం వీధుల్లో భోగిమంటలు వేసి, ఇంట్లోని పాత వస్తువులను ఆహుతి చేస్తారు. మరుసటి రోజు నుంచి కొత్త వస్తువులు ఉపయోగించడం ఆనవాయితీ. భోగి రోజున తెల్లవారుజామున పిల్లలకు తలస్నానం చేయించి రేగుపండ్లు, చెరుకు ముక్కలు, అక్షింతలు కలిపి వారి తలలపై పోయడం వల్ల దృష్టి దోషం తొలగిపోతుందని పెద్దలు నమ్ముతారు. పెద్దల చేత భోగి పండ్లను పోయించడం వల్ల చిన్నారుల ఆయుష్షు పెరుగుతందని ప్రతీతి. భోగి రోజే గోదాదేవి రంగనాథస్వామిని వివాహమాడిందని చెబుతారు. అప్పటి నుంచే ఆమె భోగభాగ్యాలు పొందిందని ప్రతీతి. భోగి రోజున మహిళలు వాకిళ్లను రంగురంగుల ముగ్గులతో నింపి, వాటి మధ్య ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెడుతారు. వాటిపై గరక పోసలు ఉంచి, చుట్టూ నవధాన్యాలు, పళ్లు పోస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి తమ ఇళ్లలోకి వస్తుందని నమ్ముతారు.
మార్కెట్లో సందడి..
ఈ మూడు రోజుల పాటు ప్రతి ఇంటి లోగిలీ ముత్యాల ముగ్గులతో కళకళలాడనుండగా, మార్కెట్లో రంగుల విక్రయాలు ఊపందుకున్నాయి. గొబ్బెమ్మల తయారీకి వాడే ఆవుపేడ, రేగు పండ్లు, బంతి పూలు, గరక పోచలు, మామిడి ఆకులను గ్రామీణులు తెచ్చి, అమ్ముతున్నారు. దీంతో ప్రధాన మార్కెట్లు వినియోగదారులతో కిటకిటలాడాయి.