కాటారం, ఫిబ్రవరి 16: కానిస్టేబుల్ ప్రవీణ్ మృతికి కారణమైన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం కాటారం పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నాగార్జునరావు నిందితుల వివరాలు వెల్లడించారు. కాటారానికి చెందిన ఊదరి రమేశ్, ఇప్పలపల్లికి చెందిన గోగుల రమేశ్, గజ్జెల శ్రీనివాస్ సులభంగా డబ్బులు సంపాదించడం కోసం వన్యప్రాణులను వేటాడి మాంసం విక్రయించి డబ్బులు సంపాదించేవారు. ఈ క్రమంలో ఈనెల 11న జంతువులను వేటాడేందుకు అడవిలో సుమారు 2 కిలో మీటర్ల మేర కర్రలు నాటి వాటికి సెంట్రింగ్ వైరు చుట్టి కరెంటు అమర్చారు. కాగా, మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు అదేరోజు రాత్రి 10.15 గంటల సమయంలో గ్రేహౌండ్స్ పార్టీకి చెందిన 13 మంది సిబ్బంది కాటారం అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో మంచిర్యాల జిల్లా నస్పూరు మండలం రాజోలిగూడ గ్రామానికి చెందిన జూనియర్ కమాండో కానిస్టేబుల్ ఆడెపు ప్రవీణ్ తీగకు తగలడంతో కరెంటు షాక్కు గురై మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విశ్వసనీయ సమాచారంతో ఊదరి రమేశ్ ఇంటికి వెళ్లగా, రమేశ్తోపాటు అక్కడే ఉన్న గోగుల రమేశ్, గజ్జె ల శ్రీనివాస్ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. కాగా, నిందితులపై హిస్టరీ షీట్ లు ఓపెన్ చేస్తున్నట్లు సీఐ తెలిపారు. నిందితుల గుర్తింపులో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ నాగార్జునరా వు, ఎస్సై అభినవ్, సిబ్బంది శ్రీనివాస్, లక్ష్మీరాజ్, హరికుమార్ను డీఎస్పీ రామ్మోహన్రెడ్డి అభినందించారు.