కాకతీయుల కాలం నాటి వేయిస్తంభాల గుడి కల్యాణ మండపం పూర్వవైభవం సంతరించుకున్నది. నీటి ప్రవాహం వల్ల పునాదిలో ఇసుక కొట్టుకుపోయి స్తంభాలు కుంగిపోయి మండపం కూలే ప్రమాదం ఏర్పడడంతో కేంద్ర పురావస్తు శాఖ 2005లో దీని పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అనేక అడ్డంకులు, నిధుల కొరత, తదితర కారణాలతో జాప్యం జరుగగా ఎట్టకేలకు 19 ఏళ్ల తర్వాత పూర్తయ్యింది. ఇందుకోసం మొత్తం రూ.15కోట్లు వెచ్చించగా సాండ్బాక్స్ టెక్నాలజీని వినియోగించి తొలగించిన రాళ్లను పేర్చేందుకు శిల్పులు రేయింబవళ్లు శ్రమించగా, త్వరలో ప్రారంభించేంచే అవకాశమున్నది.
– హనుమకొండ చౌరస్తా, మార్చి 3
కాకతీయ సామ్రాజ్య కళావైభవానికి ప్రతీకగా 132 రాతి స్తంభాలు ఉండేవి. 1163లో రుద్రదేవుడు 850 ఏళ్ల క్రితం నిర్మించాడు. కాలక్రమంలో కల్యాణ మండపం బలహీనపడడంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) దాన్ని తొలగించింది. వేయిస్తంభాల గుడి కట్టడం చెక్కు చెదరలేదు కానీ దానికి ఎదురుగా ఉన్న ఈ కల్యాణ మండపం మాత్రం శిథిలావస్థకు చేరింది. దాని కింది నుంచి ప్రవహించిన నీటిపాయ ఇందుకు కారణమని గుర్తించారు.
నీటి ప్రవాహం వల్ల పునాదిలో ఇసుక తొలగిపోయి రాతి స్తంభాలు కుంగి మండపం క్రమంగా పక్కకు ఒరిగిపోయింది. మండపం కూలే ప్రమాదం ఉందని గుర్తించిన కేంద్ర పురావస్తు శాఖ 2005లో పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పనులు చేపట్టిన తర్వాత అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. నిధుల కొరతతో పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు.
కల్యాణ మండపం పునర్నిర్మాణంలో కాకతీయుల అత్యంత సంక్లిష్టమైన సాండ్ బాక్స్ టెక్నాలజీనే అనుసరించారు. అంటే ఇసుకనే పునాదిగా చేసుకొని నిర్మాణం చేపట్టారు. కేంద్ర పురావస్తుశాఖ నిబంధనల ప్రకారం ఎక్కడా సిమెంట్, కాంక్రీట్, ఇనుము వాడలేదు. ఇసుకపై ఉన్న కట్టడాన్ని తిరిగి నిలబెట్టారు. కల్యాణ మండపం అడుగున 3 మీటర్ల లోతు మట్టి తొలగించి రాగడి మట్టి నింపి గ్రానైట్, ఇటుక, కరక్కాయలు, బెల్లం మిశ్రమంతో క్యూరింగ్ చేశారు. ఆ ఇసుక బేస్మెంట్పైనే రాళ్లను పేర్చారు. భూకంపాలు వచ్చినా కట్టడం చెక్కుచెదరకుండా రాళ్లకు రాళ్లను పట్టి ఉంచేలా స్టెయిన్లెస్ స్టీల్ పట్టీలు అమర్చారు. 3వేల శిలలు, గ్రానైట్ కళాఖండాలు, రాతి స్తంభాలు పాత కట్టడాన్ని తొలగించినప్పుడు వెలికితీసి క్రమ పద్ధతిలో నంబర్లు వేసి భద్రపరిచారు. కొన్ని స్తంభాలు పగిలిపోగా శిల్పులతో మళ్లీ చెక్కించారు.
కల్యాణ మండపానికి శిల్పులు తుది మెరుగులు దిద్దారు. తమిళనాడుకు చెందిన స్థపతి (వాస్తుశిల్పి) శివకుమార్ ఆధ్వర్యంలో 30మంది శిల్పులు నెలరోజులుగా రాత్రింబవళ్లు పనిచేశారు. స్తంభాలను తొలగించడానికి 2005లో రూ.3.50కోట్లతో పనులు ప్రారంభించారు. పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ బిల్లుల చెల్లింపులో జాప్యం చేయగా పనులు మధ్యలోనే నిలిచాయి. 15 ఏళ్ల తర్వాత 2021 నవంబర్లో పనులు పునః ప్రారంభించారు.
నిధుల కొరత కారణంగా నత్తనడకన కొనసాగినట్లు సమాచారం. పునరుద్ధరణకు మొత్తం రూ.15కోట్లు వెచ్చించి ఎట్టకేలకు పనులు పూర్తిచేశారు. వేయిస్తంభాల గుడి కల్యాణ మండపాన్ని పునః ప్రారంభించేందుకు కేంద్ర పురావస్తుశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఈ నెల 4 లేదా 5న ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అది కుదరకపోతే ఈ నెల 7న కేంద్ర మంత్రి అమిత్షా చేతులమీదుగా లేదా 8న మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించనున్నట్లు
సమాచారం.