సుబేదారి, జనవరి 13: సంక్రాతి పండుగకు స్వస్థలాలకు వెళ్తే వారు జర జాగ్రత్త.. వరంగల్ నగరంలో ఇటీవల దొంగల బెడద పెరిగింది. గతనెలలో సుబేదారి పోలీసు స్టేషన్ పరిధిలోని ఎక్సైజ్కాలనీలో ఇంటికి తాళం వేసి ఉన్న డాక్టర్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. దీంతో పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి చోరీకి పాల్పడింది అంతర్రాష్ట్ర దొంగని గుర్తించారు. హైదరాబాద్లో బైక్చోరీ చేసి, అదే బైక్పై నగరానికి వచ్చి హెల్మెట్ ధరించి డాక్టర్ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడని సీసీ కెమెరాల పుటేజీల ద్వారా తేలారు.
ఈనెల 7న మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠా హైదరాబాద్ నుంచి కాజీపేట మార్గంలో రైళ్లలో వెళ్తూ ప్రయాణికుల నుంచి బంగారు అభరాణాలు ఆపహరించారనే సమాచారంతో వరంగల్ జీఆర్పీ, ఆర్పీఎఫ్, కాజీపేట ఏసీపీ ఆధ్వర్యంలో కాజీపేట, వరంగల్ రైల్వేస్టేషన్లలో తనిఖీ చేశారు. దీపక్సింగ్, విద్యాన్కలన్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా గోల్కొండ, చార్మినార్ ఎక్స్ప్రెస్ రైళ్లలో మహిళల మెడలనుంచి ఆరున్నర తులాల బంగారు అభరణాలు చోరీ చేసినట్లు పోలీసు విచారణలో తేలింది.
పోలీసులకు సమాచారం ఇవ్వాలి
-డేవిడ్రాజ్, సీసీఎస్ ఏసీపీ
పండుగ సందర్భంగా సొంత ఊర్లకు వెళ్తువారు తప్పనిసరిగా స్థాని క పోలీసుస్టేషన్కు సమాచారం ఇవ్వా లి. దీంతో పోలీసుల నిఘా నిరంతరం ఉంటుంది. ఇళ్లకు తాళం వేసిన సమయంలో కిటికి తలుపులు సరిగా వేశామా.. డోర్ లాక్ సరి చూసుకోవాలి. పెంపుడు జంతువులుంటే ఆరుబాయట కట్టేయాలి.
ఊళ్లకు వెళ్లే ముందు ఇరుగు పొరుగువారికి తమ ఇంటిపై ఓ కన్నేసి ఉంచాలని చెప్పాలి. విలువైన వస్తువులు, బంగారు అభరణాలు, నగదు, ముఖ్యమైన ప్రతాలు ఇంట్లో ఉంచకుండా బ్యాంకులో భద్రపర్చుకోవాలి. పేపర్బాయ్, పాలు పోసే వారిని ఇంటికి రావొద్దని చెప్పాలి. కాలనీలో, ఇంటివైపు సీసీ కెమెరాలు ఉండేలా చూసుకోవాలి. అనుమానం వస్తే 100, పీఎస్కు సమాచారం ఇవ్వాలి.