ఏటూరునాగారం/తాడ్వాయి, ఫిబ్రవరి 21 : మేడారంలోని జంపన్నవాగు ప్రాంతంలో బుధవారం రాత్రి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో సుమారు 20 నిమిషాల పాటు జంపన్నవాగు నుంచి కన్నెపల్లి మూలమలుపు వద్ద గల స్తూపం వరకు పూర్తిగా అంధకారమైంది. కరెంటు పోవడంతో ఒక్కసారిగా వ్యాపారులు, భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. రోడ్డుపై లక్షలాదిగా ఉన్న భక్తులు ముందు ఏమీ కనిపించక చాలా ఇబ్బందులు పడ్డారు. దీంతో తమవారు ఎక్కడున్నారో కూడా కనిపించక ఆందోళన చెందారు. చిన్నా పెద్దా అంతా ఆగమాగం అయ్యారు.
కరెంటు పోవడంతో స్నానఘట్టాలపై ఉన్న బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ నుంచి నీళ్లు రాలేదు. దీంతో వేలాది మంది స్నానాలు సమయంలో మధ్యలోనే ఆగిపోవడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న వేలాది దుకాణాలు, చీకటి అలమటించింది. వ్యాపారులు ఆందోళన చెందారు. అదీగాక దొంగలు భయం అందరినీ కలచివేసింది. కరెంటు ఎందుకు పోయిందో తెలియక సెక్టార్ అధికారులు, పోలీసులు వైర్లెస్ సెట్లు, ఫోన్లలో మొరపెట్టుకున్నారు. కరెంటు పోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 20నిమిషాల తర్వాత కరెంటు పునరుద్ధరించడంతో అందరూ ఊపరి పీల్చుకున్నారు.