జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : గెలిచిన ఎమ్మెల్యే రాజకీయం చేసేది భగవంతుడిపై కాదని, తనపై చేస్తే దేనినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం మంజూర్నగర్లో నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయం, ఆవరణలో పూజారులకు నిర్మించిన వసతి, వర్కర్ల గృహాలు, స్టోర్ రూం, భక్తులు సేద తీరడానికి నిర్మించిన హాల్, ఆలయం వెనుక నిర్మించబోయే కల్యాణ మండపం ప్రదేశం, ఆదాయం సమకూర్చి పెట్టే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలను ఆయన విలేకరులకు చూపించా రు. అనంతరం బీఆర్ఎస్ కార్యాలయంలో మాట్లాడారు. ఆలయానికి సంబంధించిన ప్లాన్ అధికారులందరికీ తెలుసని, శంకుస్థాపన, విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాల్లో కలెక్టర్తో పాటు రెవెన్యూ అధికారులందరూ పాల్గొన్నారని తెలిపారు. నిర్మాణాలన్నీ అధికారులకు తెలిసే జరిగాయని, తానేమీ దాచలేదన్నారు. ఏడాది తర్వాత అక్రమ నిర్మాణాలని, అనుమతులు లేవని, స్థలానికి సంబంధించి కేసు కోర్టులో ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
ఆలయ నిర్వహణకు నెలకు రూ. 2 లక్షల వరకు ఖర్చు అవుతున్నదని, షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా ఆదాయం సమకూరుతుందన్నారు. పేదలు పెళ్లిళ్లు చేసుకునేందుకు ఆలయం వెనుక కల్యాణ మండపం సైతం నిర్మిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిందే అదునుగా వ్యక్తిగత కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నారన్నారు. 100 రోజుల అనంతరం తాము కూడా ప్రతిపక్ష పాత్రను బలంగానే పోషిస్తామన్నారు. ఇప్పటికైనా ఆలయంపై కుట్రలు ఆపాలని వెంకటరమణారెడ్డి సూచించారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి, బీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్, జడ్పీటీసీ జోరుక సదయ్య, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్ యాదవ్, కౌన్సిలర్లు నూనె రాజు, ఎడ్ల మౌనిక, ఆకుదారి మమత, జక్కం రవికుమార్, నాయకులు సిద్ధు, నాగుల దేవేందర్, మోతె రాజు, మల్లేశ్ యాదవ్, అల్లూరి కుమార్, గురిజాల శ్రీనివాస్, కరాటే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.