కృష్ణకాలనీ, మార్చి 15 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని సింగరేణి మినీ ఫంక్షన్హాల్లో ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సహకారంతో అలిం కో సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపి ణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గండ్ర, కలెక్టర్ భవేష్ మిశ్రా హాజరై 328కి రూ.33 లక్షలతో వీల్చైర్స్, ట్రైసైకిళ్లు, కృత్రిమ అవయవాలు, వినికిడి యంత్రాలు, జిల్లాలోని 14 డెలివరీ బెడ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అలింకో, ఈసీఎల్ కంపెనీ రెండు సంస్థలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాను ఎంచుకోవడం సంతోషకరమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా తెలంగాణలో దివ్యాంగులకు అత్యధికంగా రూ. 3,016 పింఛన్ ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తున్నదన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి దివ్యాంగుల భవనాన్ని జిల్లాలో నిర్మించామన్నారు. ప్రతి నెలా జిల్లాలోని 7,500 మంది దివ్యాంగులకు ఆసరా పింఛన్లు అందజేస్తున్నట్లు చెప్పారు. భూపాలపల్లి పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూంలలో దివ్యాంగులకు ప్రత్యే క కోటా కల్పించి అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి జిల్లాకేంద్రానికి వచ్చే విద్యార్థులకు ప్రత్యేక వాహనాలు అందజేస్తామని, ఇందుకు అధికారులు క్షేత్రస్థాయిలో నివేదికలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని వేగవంతం చేసిందని, దివ్యాంగులైన దళితులకు ప్రత్యే క స్థానం కల్పిస్తామన్నారు. అంతేకాకుండా గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు ప్రత్యేక చోటు కల్పించి, రూ. 3 లక్షలు అందజేస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ భవేశ్మిశ్రా సదరం క్యాంపులు ఏర్పాటు చేస్తూ సర్టిఫికెట్లు అందజేయడంతో పాటు రెన్యూవల్స్ త్వరగా పూర్తి చేసి అందజేస్తున్నారన్నారు.
గతేడాది 1500 సదరం సర్టిఫికెట్లు ఇచ్చాం ; కలెక్టర్ భవేశ్మిశ్రా
ఆసరా పింఛన్ల సదరం సర్టిఫికెట్ల కోసం ఇబ్బందులు ఎదురవడంతో ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేసి కొత్తగా 1,500 మందికి సర్టిఫికెట్లు అందజేశామని కలెక్టర్ భవేశ్మిశ్రా తెలిపారు. సీఎస్ఆర్ నిధులతో జిల్లాలోని దివ్యాంగులకు సహాయ పరికరాలు అందజేయడం శుభపరిణామమన్నారు. గత ఆగస్టులో ప్రత్యేక సమావేశం నిర్వహించిన తర్వాత చిట్యాల, భూపాలపల్లి, కాటారం మండలాల్లో దివ్యాంగులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. ప్రస్తుతం వారికి సహాయ పరికరాలు అందజేశామన్నారు. దివ్యాంగులు వ్యాపారవేత్తలుగా ఎదగాలనే లక్ష్యంతో రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఆర్థిక సాయం అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పా రు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర, కలెక్టర్ భవేశ్మిశ్రా దివ్యాంగులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్ధు, వైస్ కొత్త హరిబాబు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ బుర్ర రమేశ్, బీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్ కుమార్, అర్బన్ మాజీ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, జడ్పీటీసీలు పులి తిరుపతిరెడ్డి, లింగమల్ల శారద, ఈసీఐల్ యూనియన్ ప్రెసిడెంట్ షకీల్, జనరల్ సెక్రటరీ భవానీశంకర్, అలింకో సీనియర్ మేనేజర్ కేవీ రాజేశ్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి టీ శైలజ, సీపీవో సామ్యూల్, డీఎంహెచ్వో డాక్టర్ శ్రీరాం, వార్డు కౌన్సిలర్లు నూనె రాజు పటేల్, ఎడ్ల మౌనిక, ముంజాల రవీందర్, సీడీపీవోలు అవంతి, రాధిక, ఇన్చార్జి డీసీపీవో వెంకటస్వామి, మహిళాశక్తి కో ఆర్డినేటర్ శిరీష, సఖీ అడ్మిన్ గాయత్రి, దివ్యాంగు సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు నీలాంబరం, బీఆర్ఎస్ నాయకులు దేవేందర్ రెడ్డి, కరాటే శ్రీనివాస్, చిరంజీవి యాదవ్, లట్ట రాజబాబు, దేవరకొండ మధు, శ్రీకాంత్ పటేల్, యుగేంద్రచారి పాల్గొన్నారు.