మహబూబాబాద్ రూరల్, జనవరి 2: విహారయాత్ర విషాదంగా మారింది. ఐదుగురు స్నేహితులు కలిసి సంతోషంగా కారులో విహారయాత్రకు బయల్దేరగా, మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి మహబూబాబాద్ పట్టణ శివారు లో జరిగింది. టౌన్ సీఐ సతీశ్ కథనం ప్రకారం.. వరంగల్ శివనగర్కు చెందిన ఐదుగురు స్నేహితులు గుగ్గిళ్ల రవితేజ (29), వెంగళదాసు సాయిరాం(27), సంగినేని సాయిరాం, కదాడ సాయితేజ, పాక లక్ష్మణ్ కలిసి రవితేజ కారులో సోమవారం రాత్రి ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లికి పయనమయ్యారు.
ఈ క్రమంలో మహబూబాబాద్ శివారు ఏటిగడ్డతండా వద్ద కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవితేజ, సాయిరాం అక్కడికక్కడే మృతిచెందారు. సాయితేజ, సాయిరాం, లక్ష్మణ్ తలకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 100కు డయల్ చేయగా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 108 వాహనంలో మృతదేహాలతో పాటు క్షతగాత్రులను మహబూబాబాద్ ఏరియా వైద్యశాలకు తీసుకెళ్లారు. తీవ్ర గాయాలైన ముగ్గురిని వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.