వరంగల్చౌరస్తా, డిసెంబర్ 7: కాకతీయ మెడికల్ కళాశాలలో నిర్వహిస్తున్న ఉత్కర్ష వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం కేఎంసీ ఆవరణలోని ఎన్ఆర్ఐ భవన్లో రక్తదాన శిబిరం, సాయంత్రం ఆటల మైదానంలో కార్నివాల్ నైట్ ఏర్పాటు చేశారు. ఎన్ఆర్ఐ భవన్లో ఎంజీఎం బ్లడ్ బ్యాంక్ వైద్యాధికారులు డాక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ దివ్వెల మోహన్దాస్ ప్రారంభించారు. ఇందులో 85 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. అనంతరం నిర్వహించిన కార్నివాల్లో కళాశాల ప్రిన్సిపాల్, ప్రొఫెసర్లు, కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. 40 స్టాళ్లను ఏర్పాటు చేసిన ఇండియన్, చైనీస్, వెస్ట్రన్ వంటల రుచులను ఆరగించి, విద్యార్థులను అభినందించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు.