ఆకాశ వీధిన త్రివర్ణ పతాక సగర్వంగా రెపరెపలాడింది. జిల్లా వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు అంబరాన్నంటాయి. కలెక్టరేట్లో కలెక్టర్ బీ గోపి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, అదనపు కలెక్టర్లు శ్రీవత్స, అశ్వినితో కలిసి కలెక్టర్ ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను పంపిణీ చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. వర్ధన్నపేట, నర్సంపేట క్యాంపు కార్యాలయాలు, పోచమ్మమైదాన్ గోపాలస్వామి గుడి జంక్షన్ వద్ద ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్రెడ్డి, నన్నపునేని నరేందర్ త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు. అలాగే, జిల్లాలో ఆయా మండల కేంద్రాలు, గ్రామాల్లో మువ్వన్నెల జెండాలను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఆవిష్కరించారు.
74వ గణతంత్ర వేడుకలు గురువారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటాయి. ఊరూరా.. వాడవాడలా.. త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల కలెక్టరేట్లు సంబురాలతో కళకళలాడాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దేశభక్తిని పెంపొందించే పాటలకు అనుగుణంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యరీతులు కట్టిపడేశాయి. ఆయా చోట్ల జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్లు, పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జిల్లాల ప్రగతిని వివరించారు. స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించి, వివిధ ప్రభుత్వ శాఖల్లో విశేష సేవలందించిన ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందించారు.