జనగామ చౌరస్తా, మార్చి 26 : పట్టపగలే ఓ బ్యాంకు ముందు పార్కింగ్ చేసి ఉన్న కారు డ్రైవింగ్ సీటు అద్దాన్ని ధ్వంసం చేసి అందులోని రూ.2 లక్షల నగదును దుండగులు చోరీ చేసిన ఘటన జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది. అర్బన్ సీఐ ఎల్ రఘుపతిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దేవరుప్పుల మండలం కడవెండికి చెందిన తుమ్మ ప్రతాప్రెడ్డి మంగళవారం మధ్యాహ్నం ఏపీ 15 ఏజడ్ 8008 నంబర్ గల కారులో జనగామలోని ఐసీఐసీఐ బ్యాంకుకు చేరుకుని రూ.2 లక్షల నగదును డ్రా చేసుకున్నాడు. అనంతరం తన వెంట వచ్చిన మిత్రుడితో కలిసి హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వెళ్లారు. ఇదే బ్యాంకు వద్ద కారును పార్క్ చేసి లోపలికి వెళ్లారు. అంతకు ముందే ఐసీఐసీఐ బ్యాంకు వద్ద ప్రతాప్రెడ్డి నగదును డ్రా చేయడం గమనించిన ఇద్దరు అగంతకులు బైక్పై కారును వెంబడిస్తూ పంజాబ్ నేషనల్ బ్యాంకు వరకు వచ్చారు. పార్క్ చేసి ఉన్న కారు డ్రైవింగ్ సీటు వైపున్న అద్దాన్ని ధ్వంసం చేసి అందులోని రూ.2 లక్షల నగదును తీసుకెళ్లారని సీఐ రఘుపతిరెడ్డి పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజీ ఆధారంగా ఎస్సై భరత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రఘుపతిరెడ్డి వెల్లడించారు.