టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామని సోమవారం రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో సంబురాలు చేసుకుంటున్నారు. వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని డిపోల పరిధిలో పని చేస్తున్న సుమారు రెండు వేల మందికి లబ్ధి చేకూరనుండగా, ఎన్నో ఏళ్ల కలను సర్కారు నెరవేర్చడంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకొన్న సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని, ఉద్యోగ భద్రత కల్పించిన ప్రజానేతకు ఎప్పుడూ అండగా ఉంటామని చెబుతున్నారు. కాగా, అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనుండగా, ఇక నుంచి ఆర్టీసీ ఎంప్లాయీస్ ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.
– హనుమకొండ చౌరస్తా/నర్సంపేట, జూలై 31
హనుమకొండ చౌరస్తా, జూలై 31 : తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసేదిశగా మరో కీలక ముందడుగు పడింది. ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించింది. సోమవారం రాష్ట్ర మంత్రి మండలి ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరుగగా, పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించింది. త్వరలో జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనున్నది. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికులు ముందుండి పోరాడారు. రాష్ట్రం ఏర్పడితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని అప్పుడు ఉద్యమ నేతగా ఉన్న సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కాగా, ఏ రాష్ట్రంలోనూ ఇలా కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయలేదు.
హర్షం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు..
సర్కారు నిర్ణయంతో ఆర్టీసీ కార్మికుల్లో ఆనందం వెల్లివిరిసింది. వారి సంతోషానికి అవదుల్లేవు. ఎన్నో ఏళ్ల పోరాటానికి ఫలితం దక్కిందని సంబరపడ్డారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంపై హర్షం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిర్ణయంతో హర్షాతిరేకాలు..
నర్సంపేట : సర్కారు నిర్ణయంతో నర్సంపేట డిపోలోని సుమారు 500 మంది ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో కార్మికులు, వారి కుటుంబసభ్యుల ముఖాల్లో వెలుగులు నిండాయి. ప్రతి ఐదు సంవత్సరాలకోసారి వీరికి కూడా పీఆర్సీ అమలు కానుంది. ప్రభుత్వ బెనిఫిట్స్ కూడా అందనున్నాయి. ఆర్టీసీని సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించడంతో కార్మికులతో పాటు ఆర్టీసీ రూపు రేఖలు మారనున్నాయని అంటున్నారు. కొత్త బస్సుల ఏర్పాటు తదితర నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయని కార్మికులు అంటున్నారు.
మా కష్టాలను గుర్తించి..
కేబినెట్ మీటింగ్లో ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని నిర్ణయించడం హర్ణనీయం. 2011లో సకల జనుల సమ్మె సమయంలో ఇచ్చిన హామీ, తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్రను గుర్తించి సీఎం కేసీఆర్ పెద్దమనసుతో మమ్ములను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం మరిచిపోలేం.
-ఈదురు వెంకన్న, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ
బంగారు తెలంగాణలో భాగంగా..
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఆహ్వానించదగిన విషయం. సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ కోసం చేస్తున్న కృషిలోభాగంగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారు. రానున్నవి మంచి రోజులు. ప్రజలకు మెరుగైన సేవలందిస్తాం. రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాం.
– రాతిపెల్లి సాంబయ్య, సూపర్వైజర్, హనుమకొండ
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో కలపడం శుభపరిణామం. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. 11 సంవత్సరాలుగా కండక్టర్గా పనిచేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఆర్టీసీ కార్మికుల కష్టాలు తీర్చిన కేసీఆర్కు అండగా ఉంటారు.
– రాపెల్లి శంకరయ్య, కండక్టర్, హనుమకొండ
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు..
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. దీనివల్ల కార్మికులకు ఎంతో నష్టపోయారు. బిల్లును రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే పెట్టడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. ఆర్టీసీ కార్మికులు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.
– వేముల రవి, నర్సంపేట ఆర్టీసీ డిపో
చాలా సంతోషంగా ఉన్నది..
తెలంగాణ కోసం సమ్మెలో మేము ఎక్కువ రోజులు పాల్గొన్నాం. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేంత వరకు పోరాడాం. సీఎం కేసీఆర్ కూడా కార్మికులను మరువలేదు. కార్మికులకు తగిన గుర్తింపును ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేయడం వల్ల ఎంతో ఆత్మగౌరవంతో బతికే అవకాశం వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులలాగే పీఆర్సీలు, వేతనాలు పొందే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు ఎంతో రుణపడి ఉంటాం. సీఎం కేసీఆర్ చేసిన మేలును ఎన్నటికీ మరువం. సీఎం నిర్ణయం కార్మికులకు ఎంతో సంతోషం కలిగించింది.
– గొలనకొండ వేణు, నర్సంపేట ఆర్టీసీ డిపో