రాయపర్తి, జనవరి 21 : విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయురాలు అకారణంగా కొట్టడంతో ఇద్దరు విద్యార్థులు గాయపడిన ఘటన మండలంలోని అవుసులకుంట తం డాలో శనివారం వెలుగు చూసింది. దీంతో ఆగ్రహించిన బాధితుల తల్లిదండ్రులు, గ్రా మస్తులు ఆందోళన నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే.. అవుసులకుంటతండాకు చెందిన మునావత్ మంగమ్మ-వేణు దంపతుల కుమారుడు బాలకృష్ణ, ఇదే తండాకు చెందిన హపావత్ సరిత-సంతోష్కుమార్ దంపతుల కుమార్తె వైష్ణవి కొత్తూరులోని జిల్లా పరిషత్ సెకండరీ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నారు.
ఈ నెల 20న పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్న అంబటి దేవకి అకారణంగా బాలకృష్ణ, వైష్ణవిని కొట్టడంతో వారికి గాయాలయ్యా యి. గమనించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఇన్చార్జి ఎంఈవో నోముల రంగయ్య ఉపాధ్యాయులతో కలిసి దేవకి ప్రవర్తనపై అభ్యంతరం వ్యక్తం చేసేందుకు యత్నించగా వారితో వాగ్వాదానికి దిగిందని పలువురు తెలిపారు. అనంతరం బాధిత విద్యార్థులను వర్ధన్న పేటలోని దవాఖానకు తరలించి చికిత్స చేయించారు.
ఉపాధ్యాయురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలి
విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయురాలు దేవకిపై చర్యలు తీసుకుని, ఆమెను విధుల నుంచి తప్పించాలని కో రుతూ విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ కందికట్ల స్వా మి, రైతుబంధు సమితి జిల్లా ప్రతినిధి మందాడి సుదర్శన్రెడ్డి, గ్రామ కోఆర్డినేటర్ పాలెపు శ్రీనివాస్రావుతోపాటు పోలీసులు ఆందోళనకారులతో మాట్లాడారు. ఇదిలా ఉండ గా దేవకి ప్రవర్తనపై డీఈవోకు నివేదిక పంపినట్లు ఇన్చార్జి ఎంఈవో నోముల రంగయ్య తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలకనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు.