పర్వతగిరి, నవంబర్ 8: ఢిల్లీకి గులాం అవుదామా.. గల్లీలో అభివృద్ధి చేసుకుందామా అని ప్రజలు ఆలోచించాలని వర్ధన్నపేట నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. బుధవారం మండలంలోని వడ్లకొండ, రోళ్లకల్, నారాయణపురం, సోమారం, జమాల్పురం, గోరుగుట్టతండా, చౌటపెల్లి, హట్యాతండా, దౌలత్నగర్, సీకే తండా, ఇస్లావత్ తండాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పార్టీ శ్రేణులు, మహిళలు, ప్రజలు కోలాటాలు, బతుకమ్మలు, ఘనంగా స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల వేళ కొత్త వేషాలతో వస్తున్న వారి మాటలు నమ్మొద్దని చెప్పారు. ప్రజల కష్టాల్లో భాగస్వామినవుతున్న తనను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలకు అడ్డూ అదుపు లేదని, తెలంగాణలో అధికారంలోకి వచ్చేది లేదని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని చెప్పారు. 50 ఏండ్లు ప్రజలను అరిగోస పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడొచ్చి ఏదో ఎలగబెట్టుతనంటోందని ఎద్దేవా చేశారు. ఎంత బాధలు అనుభవించామో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. 24గంటల కరెంట్ వద్దని, మూడు గంటల కరెంట్ చాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అంటున్నాడని, ఎలా సరిపోతుందో చెప్పాలని అడిగారు. కాంగ్రెస్ పాలనలో విత్తనాలు లేక, ఎరువులు దొరక్క, పురుగుల మందు పనిచేయక, గిట్టుబాటు ధర రాక, తీరక వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వివరించారు. తెల్లారి లేస్తే పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య, ఉరేసుకుని ఆత్మహత్య అనే వార్తలు చూసేవాళ్లమని చెప్పారు.
ఇప్పుడు సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఎంతో సస్యశ్యామలంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే సంక్షేమ పథకాలు రద్దు అవుతాయని చెప్పారు. కర్ణాటక రాష్ట్రంలో కరెంట్ సరిగా ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో వచ్చి రాని కరెంట్తో ఎంతో తిప్పలు పడేదని, రాత్రి పూట కరెంట్ మోటార్ పెట్టడానికి పోయి షాక్కొట్టి చనిపోయిన రైతులు, పాములు తేళ్లు కుట్టి ఎంతో మంది చనిపోయారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలో అందరూ ముఖ్యమంత్రి అభ్యర్థులమని చెప్పుకుంటున్నారని, అభివృద్ధి చేస్తామని ఒక్కరు కూడా చెప్పడంలేదన్నారు. బీజేపీ ఇప్పటి వరకు మ్యానిఫెస్టో ప్రకటించలేదన్నారు. రెండుసార్లు తనను బిడ్డగా కడుపులో పెట్టుకుని చూసుకున్నారని, నమ్మకాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గ అభివృద్ధికి కష్టపడి పనిచేశానని చెప్పారు. ఇప్పటికే నియోజకవర్గంలో రూ.4వేల కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, పర్వతగిరి మండలంలోనే రూ.700కోట్లతో చేపట్టినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మరోసారి ప్రజలకు సేవచేసే అదృష్టం వచ్చిందని, మరోసారి తనను ఆశీర్వాదించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఎంపీపీ కమల పంతులు, జడ్పీటీసీ సింగ్లాల్, వైస్ ఎంపీపీ రాజేశ్వర్రావు, సర్పంచులు అమడగాని రాజు, రామ్మోహన్, వెంకటేశ్వర్లు, రాపాక రేణుక, పిడుగు రేణుక, ఉమారాజు, సరోజన, మార్కెట్ డైరెక్టర్ ఏకాంతంగౌడ్, బోయినపల్లి యుగేందర్రావు పాల్గొన్నారు.