హనుమకొండ, ఫిబ్రవరి 27: రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చేలోగా దళిత బంధు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో నామినేషన్లు వేస్తామని రాష్ట్ర దళిత బంధు సాధన ఐక్య పోరాట సమితి అధ్యక్షుడు కోగిల మహేశ్, కన్వీనర్ చిట్టిమల్ల సమ్మయ్య హెచ్చరించారు. రెండో విడుత దళితబంధు డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం నిలిపేయడంపై వారి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రెండో విడుతలో ఎంపికైన లబ్ధిదారులు మంగళవారం హనుమకొండలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద నిరసన తెలిపారు. తమ ఖాతాల్లో వెంటనే దళిత బంధు డబ్బులు జమ చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దళితబంధు పథకంలో కలెక్టర్ ద్వారా పారదర్శకంగా ఎంపికై గ్రౌండింగ్ చేసిన రెండో విడుత లబ్ధిదారుల ఖాతాల్లోకి కలెక్టర్ అకౌంట్ లో ఉన్న డబ్బులను జమ చేయాలన్నారు. లేని పక్షంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితబంధు లబ్ధిదారులందరం నామినేషన్లు వేస్తామని హెచ్చరించారు. రెండు నెలలుగా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు, దీక్షలు చేపట్టినప్పకీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఇంకా స్పందించకుంటే భవిష్యత్తులో ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా కార్యాచరణ రూపొందించుకుంటామని అన్నారు. రెండో విడుత దళిత బంధు ద్వారా ఎంపికై గ్రౌండింగ్ అయిన లబ్ధిదారుల ను మార్పులు చేర్పులతో కాలయాపన చేయొద్దని, వారందరూ బిడ్డలేనని గుర్తించాలని సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమా ర, రాష్ట్ర మంత్రి మండలికి పలుమార్లు విజ్ఞప్తి చేశామన్నా రు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు కొనసాగిస్తామని, అందు కు బడ్జెట్లో రూ.1000కోట్లు కేటాయిస్తామన్న ప్రకటనను స్వాగతించామని గుర్తుచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. అంబేదర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రాష్ట్ర దళిత బంధు సాధన సమితి నాయకులు కావేరి చిన్ని కృష్ణ, మడికొండ రమేశ్, బోనగిరి శ్రీనివాస్, దర్శనాల సంజీవ, దుర్గం రాజేశ్, కార్తీక్, ఐత ప్రశాంత్, కనకం విశ్వనాథ్, అచ్చుకట్ల రమేశ్, భూపెల్లి రాజు, గోలొండ బుచ్చ న్న, మాదరి రాంబాబు రామకృష్ణ, రమేశ్, గాజర్ల వెంకన్న, ఎడ్ల కిరణ్, బీసా సాంబయ్య పాల్గొన్నారు. కాగా, మహేశ్, సమ్మయ్య ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళితుల ఆకాంక్షలను గుర్తించి న్యాయం చేయాలని, అరెస్టులు, నిర్బంధాలు సరికావన్నారు.