వర్ధన్నపేట, ఫిబ్రవరి 20 : ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ స్పష్టం చేశారు. మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొంత ఇంటి స్థలం ఉండి పక్కా గృహంలేని పేదలకు త్వరలోనే ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇంటిని మంజూరు చేయనున్నదని పేర్కొన్నారు. త్వరలోనే అధికారులు దరఖాస్తులు తీసుకోనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ స్థలాల కొరత వల్ల సాధ్యం కాలేదని చెప్పారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, బోదకాలు బాధితులకు ఆసరా పింఛన్లను అందిస్తున్నదని వివరించారు. ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాల అమలులో వెనుకడుగు వేయకుండా ప్రజలకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
మాటలు చెప్పేవారిని నమ్మొద్దు..
కేవలం మాటలు చెప్పి రాజకీయ లబ్ధి పొందాలని చూసేవారిని ప్రజలు నమ్మొద్దని ఎమ్మెల్యే రమేశ్ కోరారు. ఎన్నికల సమయం దగ్గరకు వస్తుండడంతో విపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని, గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశా రో నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగా ణ ప్రభుత్వం ప్రజా అవసరాలను గుర్తించి ప్రతి ఊరి లో అంతర్గత సీసీరోడ్లు, వైకుంఠధామాలు, నర్సరీలు, డంపింగ్ యార్డులు, ఇతర అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న పార్టీలు ప్రజలకు ఏమీ చేయలేదన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఉండాలని కోరారు. సమావేశంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ అరుణ, వైస్చైర్మన్ ఎలేందర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ స్వామిరాయుడు పాల్గొన్నారు.