గ్రామాల్లో సరైన వసతులు లేక అనేక మంది క్రీడాకారులు మిన్నకుండి పోతున్నారు. వివిధ క్రీడల్లో ప్రవేశం ఉన్నా వెలుగులోకి రాలేకపోతున్నారు. ఇలా మరుగున పడిపోతున్న వారి కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలో 576 జీపీలు, హ్యాబిటేషన్లలో 389 చోట్ల ఆట స్థలాల నిర్మాణానికి అధికారులు ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. ఇందులో 301 పంచాయతీలు, 27 హ్యాబిటేషన్ల పరిధిలో పనులను ప్రారంభించారు. ఇప్పటికే 313 ప్రాంగణాల నిర్మాణం పూర్తవడంతో అందుబాటులోకి వచ్చాయి. మరో పదిహేను ఆట స్థలాల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మారుమూల పల్లెల్లోనూ స్టేడి యాలు అందుబాటులోకి వస్తుండడంతో క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్, ఫిబ్రవరి 24(నమస్తేతెలంగాణ) : పల్లెల సమగ్ర ప్రగతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. ఈ నేపథ్యంలో సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన తండాలు, గూడేలు, శివారు పల్లెలను ప్రత్యే క గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. నిర్వహణ కోసం ప్రతి గ్రామ పంచాయతీకి నెలనెలా నిధు లు కేటాయిస్తున్నది. పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నది. ప్రతి గ్రామపంచాయతీ పరిధి లో ప్రత్యేకంగా ఒక నర్సరీ ఏర్పాటు చేసింది. ఆహ్లాదం కోసం హ్యాబిటేషన్లో పల్లె ప్రకృతి వనం నెలకొల్పింది. పరిశుభ్రత కోసం గ్రామ పంచాయతీకో ట్రాక్టర్ లేదా ట్రాలీని సమకూర్చింది.
డంపింగ్ యార్డు, వైకుంఠధామం, వాడవాడనా సీసీ రోడ్లు నిర్మించింది. వీటికితోడు మంకీ ఫుడ్కోర్టులు, బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతో పల్లెల రూపురేఖలు మారిపోతున్నాయి. ఈ క్రమంలో క్రీడాకారుల కోసం పల్లెల్లో క్రీడా ప్రాంగణాలు నిర్మించాలని నిర్ణయించింది. హ్యాబిటేషన్కో ఆట స్థలాన్ని నిర్మించే పనిలో తలమునకలైంది. జిల్లా లో ఇప్పటికే 313 ప్రాంగణాలను నిర్మించింది. మరో 15 ఆట స్థలాల్లో పనులు తుది దశలో ఉన్నాయి. ప్రతి జీపీ పరిధిలోనే గాకుండా హ్యాబిటేషన్లో కూడా క్రీడా ప్రాంగణం నిర్మించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో అధికారులు ప్రతి హ్యాబిటేషన్ పరిధిలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు కోసం అనువైన ప్రభు త్వ స్థలాలను గుర్తించే పనిలో పడ్డారు. ఎకరం లేదా అంతకంటే తక్కువగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తిం చి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిస్తున్నారు. పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తున్నది. నిధులు మంజూరు కాగానే అధికారులు క్రీడా ప్రాంగణ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ప్రతి గ్రౌండ్లో వాలీబాల్, ఖోఖో కోర్టులు, సింగిల్ బార్, డబుల్ బార్తో పాటు లాంగ్జంప్ ప్రాక్టీస్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలో 323 గ్రామ పంచాయతీలు, 253 హ్యాబిటేషన్లు ఉన్నాయి. మొత్తం 576 ప్రాంతాల్లో 389 క్రీడా ప్రాంగణాల నిర్మాణానికి అధికారులు ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. 323 జీపీల్లో స్థలాలు గుర్తించగా, 253 హ్యాబిటేషన్లలో కేవలం 66 హ్యాబిటేషన్ల పరిధిలో ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. మిగిలిన 187 ప్రాంతాల్లో స్థలాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటివరకు 328 క్రీడా ప్రాంగణాల నిర్మాణ పనులు చేపట్టారు. 286 పూర్తి చేశారు. వీటిలో కొన్నింటిని ఇటీవల కలెక్టర్ బీ గోపి, డీఆర్డీవో సంపత్రావుతో పాటు స్పెషల్ ఆఫీసర్లు పరిశీలించారు. మిగతా పదిహేను క్రీడా ప్రాంగణాల నిర్మాణ పనులు వివిధ దశ ల్లో సాగుతున్నాయి. పర్వతగిరి, రాయపర్తి, సంగెం, వర్ధన్నపేట మండలాల్లో వంద శాతం క్రీడా ప్రాంగణాల నిర్మాణం పూర్తయినట్లు డీఆర్డీవో వెల్లడించారు.
చెన్నారావుపేటలో 73, దుగ్గొండిలో 94, గీసుగొండలో 71, ఖానాపురంలో 75, నల్లబెల్లిలో 83, నర్సంపేటలో 78, నెక్కొండలో 87 శాతం జీపీల్లో క్రీడా ప్రాంగణాలను నిర్మించినట్లు తెలిపారు. ప్రభుత్వ స్థలాల గుర్తింపు జరిగిన 66 హ్యాబిటేషన్లలో 27 ప్రాంగణాల నిర్మాణ పనులను పూర్తి చేశారు. వీటిలో చెన్నారావుపేటలో 2, ఖానాపురం 1, నెక్కొండ 3, పర్వతగిరి 3, రాయపర్తి 15, సంగెం 3 ఉన్నాయి. ఈ మండలాల్లోని కొన్ని హ్యాబిటేషన్ల పరిధిలో త్వరలోనే క్రీడా ప్రాంగణాల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. దుగ్గొండి, గీసుగొండ, నల్లబెల్లి, నర్సంపేట, వర్ధన్నపేట మండలాల్లో ఒక హ్యాబిటేషన్లోనూ నిర్మాణ పనులు మొదలు కాలేదు. ఇంకా పూర్తికాని 37 జీపీలు, 226 హ్యాబిటేషన్ల పరిధిలో క్రీడా ప్రాంగణాల నిర్మాణం పూర్తి చేసే దిశగా అధికారులు ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన క్రీడా ప్రాంగణాలను స్థానికులు వినియోగించుకుంటున్నారు. ప్రతి గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణం ఏర్పాటుతో క్రీడాకారులు మురిసిపోతున్నారు.