దళితుల జీవితాల్లో వెలుగు నింపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకం అమలు చేస్తున్నది. అర్హులకు రూ.10 లక్షల విలువైన కోరుకున్న యూనిట్ను అందజేస్తున్నది. ఇప్పటికే ప్రతి శాసనసభ నియోజకవర్గ పరిధిలో వంద మందికి యూనిట్లను పంపిణీ చేయగా, లబ్ధిదారులు ఆదాయం పొందుతూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఈ క్రమంలో లబ్ధిదారుల వివరాలు, ఆస్తుల నమోదుకు రాష్ట్ర సర్కారు ప్రత్యేక యాప్ను రూపొందించింది. కొద్ది రోజుల నుంచి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు జిల్లాలోని దళితబంధు లబ్ధిదారుల వివరాలు, యూనిట్ల సమాచారాన్ని ఈ యాప్లో పొందుపరుస్తున్నారు. ఫొటోలను అప్లోడ్ చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో వివరాల నమోదు పూర్తి కానుందని ఎస్సీ కార్పొరేషన్ జిల్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ) సురేశ్ తెలిపారు.
– వరంగల్, మార్చి 5 (నమస్తేతెలంగాణ)
వరంగల్, మార్చి 5(నమస్తేతెలంగాణ) : దళితబంధు పథకం ద్వారా తొలివిడుత జిల్లాలో 303 మందికి లబ్ధి చేకూరింది. ఒక్కొక్కరికి రూ.10 లక్షల విలువైన యూనిట్ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. చెన్నారావుపేట మండలం లింగగిరి గ్రామంలో 13, దుగ్గొండి మండలం రేఖంపల్లిలో 12, ఖానాపురం మండలం బుధరావుపేటలో 12, నల్లబెల్లి మండలం రామతీర్థంలో 12, నర్సంపేట మండలం గురిజాలలో 14, నెక్కొండ మండలం తోపనపల్లిలో 13, నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 24, రాయపర్తి మండలం కిష్టాపూర్లో 20, పర్వతగిరి మండలం అనంతారంలో 10, వర్ధన్నపేట మండలం అంబేద్కర్నగర్లో 10, ఇల్లందలో 1, వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో 14, ఖిలావరంగల్ మండలం మామునూరులో 8, వరంగల్ మండలం కొత్తపేటలో 10, గీసుగొండ మండల కేంద్రంలో 15, సంగెం మండల కేంద్రంలో 15, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 100 మంది దళితబంధు పథకం ద్వారా యూనిట్లను పొందారు. వీరికి ప్రభుత్వం 3 మినీ డెయిరీ, 5 గొర్రెల యూనిట్లతో పాటు ట్రాన్స్పోర్టు సెక్టార్లో 4 గ్రూపు యూనిట్లు, 26 త్రీ అండ్ ఫోర్ వీలర్ గూడ్స్ వెహికిల్స్, మరో 86 త్రీ అండ్ ఫోర్ వీలర్ ప్యాసింజర్ వెహికిల్స్(కార్లు), 70 ట్రాక్టర్లు, 107 రిటేల్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇతర సర్వీసు సెక్టార్ల యూనిట్లను అందజేసింది.
గ్రూపు యూనిట్లలో ఎనిమిది మంది లబ్ధిదారులు మూడు హార్వెస్టర్లు, ముగ్గురు కలిసి ఒక జేసీబీని పొందారు. రాయపర్తి మండలం కిష్టాపూర్లో గ్రూపు యూనిట్ కింద రూ.23.90 లక్షలతో హార్వెస్టర్ పొందిన లబ్ధిదారులు నెలనెలా రూ.60 వేల ఆదాయం గడిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నర్సంపేట మండలం గురిజాలలో గ్రూపు యూనిట్ కింద రూ.34.09 లక్షలతో జేసీబీని పొందిన లబ్ధిదారులకు నెలనెలా రూ.72 వేల ఆదాయం వస్తున్నట్లు తెలిపారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో రూ.9.90 లక్షలతో ఎరువులు, పురుగు మందుల దుకాణం ప్రారంభించిన దళితబంధు లబ్ధిదారుడు నందిపాక దినేశ్కు ప్రతి నెలా రూ.35 వేలు, వరంగల్లోని కాశీబుగ్గ ప్రాంతంలో రూ.9.90 లక్షలతో టైల్స్ అండ్ శానిటరీ స్టోర్ను ప్రారంభించిన పెండ్యాల సోనీబాబుకు నెలనెలా రూ.26 వేలు, పర్వతగిరి మండలం అనంతారంలో రూ.9.90 లక్షలతో మెడికల్ షాపు ప్రారంభించిన రణధీర్కు ప్రతి నెలా రూ.32 వేల ఆదాయం సమకూరుతున్నట్లు వివరించారు.
యాప్లో నిక్షిప్తం..
దళితబంధు లబ్ధిదారుల వివరాలు, వారు నిర్వహిస్తున్న యూనిట్లను పొందుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తెచ్చింది. వివరాలు నమోదు చేయడంపై ఎస్సీ కార్పొరేషన్లోని కొందరు ఉద్యోగులకు ఇటీవల శిక్షణ ఇచ్చింది. వీరు మున్సిపల్, పంచాయతీశాఖ అధికారులు, ఉద్యోగులతో కలిసి మూడు రోజుల నుంచి జిల్లాలో లబ్ధిదారుల వివరాలు, యూనిట్లను యాప్తో నమోదు చేస్తున్నారు. దుకాణాలు, వెహికిల్స్ ఫొటోలను అప్లోడ్ చేస్తున్నారు. లబ్ధిదారులు యూనిట్ ద్వారా నెలనెలా పొందుతున్న ఆదాయ వివరాలను కూడా పొందుపరుస్తున్నారు. దీంతో లబ్దిదారుకు ప్రభుత్వం దళితబంధు పథకం ద్వారా ఇచ్చిన యూనిట్ ఏమిటి?, అది ఎక్కడ పనిచేస్తుంది?, నెలనెలా సమకూరుతున్న ఆదాయం ఎంత? అనే సమగ్ర సమచారం యాప్లో లభించనుంది. దీంతో పాటు వివరాలు నమోదు చేసుకున్న వారికి దళితబంధు రక్షణ నిధి పొందే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఈ నిధి కింద లబ్ధిదారులు తమ వాటా రూ.10 వేలు చెల్లిస్తే ప్రభుత్వం మరో రూ.10 వేలు వారి ఖాతాలో జమ చేస్తుంది. మంగళవారం వరకు జిల్లాలో దాదాపు 150 మంది వివరాలు, యూనిట్ల నమోదు జరిగినట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్ తెలిపారు. ప్రతి లబ్ధిదారుడికి అతడి ఫొటో, క్యూఆర్ కోడ్తో స్మార్ట్ కార్డును అందజేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. క్యూఆర్ కోడ్తో స్కాన్ చేస్తే యూనిట్, లావాదేవీల వివరాలను తెలుసుకోవచ్చు. ఇకపై ఈ యాప్తో అధికారులు దళితబంధు పథకం అమలును మానిటరింగ్ చేయనున్నారు. నమోదు పూర్తవగానే సాధ్యమైనంత త్వరలో లబ్ధిదారులకు యూనిట్ల నిర్వహణపై ఒకరోజు శిక్షణ ఇచ్చి లాగ్బుక్, క్యాష్బుక్లను అందజేయడానికి ఎస్సీ కార్పొరేషన్ అధికారులు సన్నద్ధమవుతున్నారు.
వాహనం రిజిస్ట్రేషన్ తప్పనిసరి : సురేశ్, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్
దళితబంధు పథకం నుంచి ట్రాన్స్పోర్టు వాహనం పొందిన లబ్ధిదారులు వాహనానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పటికీ పలువురు తాత్కాలిక రిజిస్ట్రేషన్పైనే నడుపుతున్నారు. దీంతో ఆర్టీఏ అధికారులు ఆ వాహనాలపై జరిమానా విధిస్తున్నారు. లబ్ధిదారులు, వారి యూనిట్ల వివరాలను ప్రత్యేక యాప్లో నమోదు చేసే కార్యక్రమం రెండు మూడు రోజుల్లో పూర్తి కానుంది. తర్వాత జిల్లాలోని దళితబంధు పథకం లబ్ధిదారులకు యూనిట్ల నిర్వహణపై త్వరలో ఎస్బీఐ ఆర్సెటీ సంస్థ ద్వారా ఒకరోజు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. లబ్ధిదారులందరికీ స్మార్టు ఐడీ కార్డులను, లాగ్బుక్, క్యాష్బుక్లను కూడా త్వరలో సరఫరా చేస్తాం.