లాభదాయక పంటల సాగుకు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా అధిక సాంద్రత విధానం (ఒకేసారి పూత, కాత రావడం)లో పత్తి పంట సాగుకు ప్రణాళిక రూపొందించింది. ఒక్కో ఎకరానికి విత్తనాలు, కలుపు, పురుగు మందుల కోసం రూ.4 వేల సాయం చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయశాఖ అధికారుల సూచన మేరకు 9 మండలాల్లోని 225 మంది రైతులు ఈ ఏడాది వాన కాలంలో 378.37 ఎకరాల్లో పత్తి పంట వేశారు. వీరికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మెళకువలపై అవగాహన కల్పించారు. పూత, కాత ఒకేసారి రావడంతో రైతులు ఒకేసారి పత్తి తీస్తున్నారు. దీంతో కూలీల కొరతనూ అధిగమిస్తున్నారు. ఎకరాకు 15 నుంచి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. యాసంగిలో భాగంగా ఈ పద్ధతి ద్వారా రెండో పంట వేయడానికి సన్నద్ధం అవుతున్నారు.
వరంగల్, డిసెంబర్ 7(నమస్తేతెలంగాణ) : అధిక సాంద్రత విధానం పాటించి పత్తి సాగు చేసిన రైతులు ఆశించిన లాభాలను పొందుతున్నారు. పెట్టుబడి భారం తగ్గింది. పంట దిగుబడి పెరిగింది. వీటికితోడు ఈ ఏడాది రెండో పంట సాగు చేసుకొనే అవకాశం ఏర్పడింది. ఈ ఏడాది వానకాలం అధిక సాంద్రత విధానం పాటించి పత్తి సాగు చేసిన రైతులు యాసంగి పంట సాగుకు సన్నద్ధమవుతున్నారు. వ్యవసాయంలో లాభదాయక పంటల సాగుకు రైతులను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రయోగాత్మకంగా అధిక సాంద్రత విధానంతో పత్తి సాగుకు నిర్ణయించింది. ఈ విధానం పాటించి పత్తి సాగు చేసే రైతులను ప్రోత్సహించేందుకు ప్రణాళిక రూపొందించింది.
రైతులకు ఒక్కో ఎకరానికి విత్తనాలు, కలుపు, మందుల రూపంలో రూ.4వేల సహాయం చేయనున్నట్లు ప్రకటించింది. వ్యవసాయశాఖ అధికారులు తొమ్మిది మండలాల్లోని 225 మంది రైతులను ఈ ఏడాది పత్తి సాగు చేసేందుకు ప్రోత్సహించారు. 378.37 ఎకరాల్లో అధిక సాంద్రత విధానం పాటించి పత్తి సాగు చేశారు. వీరికి వ్యవసాయశాఖ అధికారులు ఆధునిక పరిజ్ఞానం, మెళకువలపై అవగాహన కల్పించారు. ఒక్కో ఎకరంలో సాధారణ పద్ధతిలో 7,407 పత్తి గింజలను నాటగా అధిక సాంద్రత విధానం ద్వారా 44,444 పత్తి గింజలను విత్తారు. వరుసల మధ్య 90 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెం.మీ దూరం ఉండేలా నాటారు. ఎత్తు పెరగకుండా పత్తి పంటలోని మొక్కలన్నింటికీ ఒకేసారి పూత, కాత రావడం అధిక సాంద్రత విధానం స్పెషల్.
సాధారణ పద్ధతిలో వానకాలం సాగు చేసే పత్తి పంట యాసంగి సీజన్ ముగిసే వరకు ఉంటుంది. దశలవారీగా పూత, కాత రావడం వల్ల రైతులు విడుతల వారీగా పత్తి తీస్తున్నారు. దీంతో ఏడాదిలో రెండో పంటను సాగు చేయలేని పరిస్థితి. అధిక సాంద్రత విధానంలో పూత, కాత ఒకేసారి రావడం వల్ల రైతులు ఒకేసారి పత్తి తీస్తున్నారు. దీంతో కూలీల కొరతను కూడా అధిగమిస్తున్నారు. దిగుబడులూ గణనీయంగా పెరిగాయి. సాధారణ పద్ధతిలో ఎకరానికి దిగుబడి 8 నుంచి 10 క్వింటాళ్లు దాటడం లేదు.
అధిక సాంద్రత విధానంలో 15 నుంచి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. వానకాలం అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు చేసిన రైతులు పత్తి తీస్తున్నారు. ఆశించిన దిగుబడి వస్తుండడంతో మురిసిపోతున్నారు. ఇప్పుడు రెండో పంట సాగు చేయడానికి సన్నద్ధమవుతున్నారు. అధిక సాంద్రత విధానం ద్వారా పత్తి పంట సాగు చేసిన రైతులకు ఒక ఎకరంలో పదిహేను క్వింటాళ్లకుపైగా దిగుబడి వస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఉషాదయాళ్ చెప్పారు. ఈ రైతులకు ప్రభుత్వం ఎకరానికి రూ.4 వేల సహాయం చేసినట్లు ఆమె తెలిపారు.
గీసుగొండ : అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేస్తే మంచి దిగుబడి వచ్చింది. నేను 8 ఎకరాల్లో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి పంట సాగు చేశాను. ఎకరానికి 25 వేల విత్తనాలు నాటాను. మొక్కల మధ్య 5 నుంచి 6 ఇంచుల దూరం మాత్రమే ఉండేలా చూసుకున్నాం. పెట్టుబడి ఖర్చులు తగ్గాయి. పంట ఒకే సారి చేతికందుతుంది.
– ధనేకుల వెంకటేశ్వర్లు, రైతు, అనంతారం
గీసుగొండ : అధిక సాంధ్రత పత్తి సాగుతో ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పంట మొత్తం ఒకే సారి చేతికందడంతో కూలీల ఖర్చులు తగ్గాయి. ఈ ఏడాది నూజివీడు, రాశి కంపెనీల ద్వారా విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేసింది. చీడపురుగు, గులాబీ రంగు పురుగు పంటను ఆశించదు. ప్రభుత్వం విత్తనాల పరఫరాలోనూ సబ్సిడీ ఇచ్చింది.
– బానోత్ నర్సింగం, రైతు, సూర్యతండా