వర్ధన్నపేట, అక్టోబర్ 5 : నూతనంగా ఏర్పడిన వర్ధన్నపేట మున్సిపాలిటీ పట్టణానికి కొత్త హంగులు సంతరించుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రాన్ని మున్సిపాలిటీగా ప్రకటించిన తరువాత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. దీంతో వర్ధన్నపేట పట్టణంలో ముమ్మరంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా వరంగల్-ఖమ్మం జాతీయ ప్రధాన రహదారిని పట్టణంలో వైడెనింగ్ చేయించడంతోపాటు కొత్తగా విద్యుత్లైన్లను ఏర్పాటు చేశారు. పాత రహదారి పక్కనే ఉండే విద్యుత్ స్తంభాలను కూడా తొలగించి రెండు వైపులా బీటీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రహదారిపై అధునాతన పద్ధతిలో డివైడర్ను నిర్మించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడంతో వర్ధన్నపేట రాత్రి సమయంలో పాలపుంతగా కనిపిస్తున్నది. రహదారి పక్కనే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం జరుగుతుండడంతో స్థానిక వ్యాపారులు సంతోషం వ్యక్తం చేశారు. దీనికితోడు వర్ధన్నపేటలో 50ఏళ్ల క్రితం నిర్మించిన డ్రైనేజీని ఆధునీకరించడంతో పాటు అంతర్గత సీసీరోడ్ల నిర్మాణంతో వర్ధన్నపేటలో పట్టణ వాతావరణం కనిపిస్తున్నది.
వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిలోని వర్ధన్నపేట అంబేద్కర్ సెంటర్కు కొత్త హంగులు సంతరించుకుంటున్నాయి. జాతీయ రహదారి కేవలం డబుల్ రోడ్డుగా ఉండడంతోపాటు రహదారి మధ్యలో అంబేద్కర్ విగ్రహం ఉండడం వల్ల అంబేద్కర్ సెంటర్ ఇరుకుగా ఉండేది. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రాన్ని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసి అభివృద్ధి పనులకోసం సుమారు రూ.100 కోట్ల మేరకు గత నాలుగేళ్లుగా విడుదల చేసింది.
దీంతో ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆధ్వర్యంలో పట్టణంలో ముమ్మరంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పట్టణంలో జాతీయ రహదారిని వైడెనింగ్ చేసి రూ.50లక్షల వ్యయంతో అంబేద్కర్ జంక్షన్ను అభివృద్ధి చేస్తున్నారు. పాత అంబేద్కర్ సెంటర్ మధ్యలోనే అధునాతన పద్ధతిలో సర్కిల్ను ఏర్పాటు చేసి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహం చుట్టూ సర్కిల్ పచ్చదనం ఉండేలా పనులు జరుగుతున్నాయి. విగ్రహం పక్కన కూడా సింహాలు, ఇతర విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు.
అంబేద్కర్ సెంటర్ సర్కిల్ పక్కనే రూ.2కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం జరుగుతుండడంతో వర్ధన్నపేట పట్టణానికి చెందిన వ్యాపారులు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన కూడలి పక్కనే మార్కెట్ ఏర్పాటు చేస్తుండడం వల్ల రైతులు, వ్యాపారులు సులువుగా మార్కెట్లోకి కూరగాయలు, ఇతర వస్తువులను మార్కెట్కు తీసుకువచ్చే వీలు ఉంటుంది. దీనికితోడు ఇంతకాలం రహదారి పక్కనే చిన్నచిన్న షెడ్లు వేసుకొని వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులు ఇకపై మార్కెట్లోనే కూరగాయాలు, మాంసాహారం, ఇతర నిత్యావసర సరుకులు విక్రయించుకునే అవకాశం ఏర్పడనున్నది. రైతులు కూడా వారు పండించే కూరగాయలు, ఇతర ఆహార పంటలను కూడా నేరుగా మార్కెట్కు తరలించి వ్యాపారులకు విక్రయించుకునే సౌకర్యం మెరుగు కానున్నది.
కూరగాయలు, పండ్లు, అన్ని రకాల నిత్యావస సరుకులు కూడా ఒకేచోట లభించనున్నందున పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీటితోపాటు సంగెపు వాగు వద్దనే అధునాతనంగా రూ.2కోట్లతో దోబీఘాట్ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దుస్తులను శుభ్రం చేసే అధునాతనమైన యంత్రాలు రానున్నందున రజక వృత్తిదారులు, పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్ని మెరుగైన వసతులతో సంగెపువాగు ఒడ్డుకు శ్మశాన వాటిక నిర్మాణ పనులు కూడా పూర్తవుతున్నాయి. గత నాలుగేళ్లలో వర్ధన్నపేట పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులతో వర్ధన్నపేట పట్టణ రూపురేఖలు మారిపోతున్నాయి. అనేక సమస్యలతో ఉన్న వర్ధన్నపేట పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే అరూరి రమేశ్కు పట్టణ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడంతో వర్ధన్నపేటలో పట్టణ వాతావరణం నెలకొన్నది. ఆకేరువాగు నుంచి మొదలుకొని సంగెపువాగు, అంబేద్కర్ సెంటర్ నుంచి ఫిరంగిగడ్డ వరకు జాతీయ రహదారిపై రూ.1.99 కోట్లతో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో రాత్రి సమయంలో వర్ధన్నపేట పట్టణంలో విద్యుద్దీపాల కాంతిలో వెలిగిపోతున్నది. గతంలో ఇరుకురోడ్డుతో లైటింగ్ లేకపోవడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. అంతేకాక విద్యుత్ ఆధునీకరణ పనులు కూడా చేయడంతో గృహాల వినియోగదారులు, వ్యాపారులకు ఎలాంటి అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా జరుగుతోంది. దీంతో అన్ని వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే డివైడర్పై ఏర్పాటు చేసిన పూలమొక్కలతో పట్టణానికి కొత్తశోభ సంతరించుకుంది.