భూపాలపల్లి టౌన్, ఆగస్టు 20 : ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదనే నెపంతో తండ్రిని తనయుడు హతమార్చిన ఘటన భూపాలపల్లి మండలం దూదేకులపల్లి గ్రామంలో జరిగింది. కుమారుడు ధనుంజయ్ దాడిలో తండ్రి బత్తుల తిరుపతి(50) అక్కడికక్కడే మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బత్తుల తిరుపతి, కుమారుడు ధనుంజయ్ కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నారు. తిరుపతి భార్య ఏడాది క్రితమే మృతి చెందింది. ధనుంజయ్కి ఇంకా వివాహం కాలేదు. మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో తరుచూ తండ్రితో డబ్బుల కోసం గొడవ పడుతుండే వాడు. ఇటీవల తిరుపతి ఎడ్లను విక్రయించగా వచ్చిన డబ్బు కోసం ధనుంజయ్ గొడవ పడుతున్నాడు.
కాగా, మూడు రోజుల క్రితం డబ్బులు ఇవ్వడం లేదనే కోపంతో రాడ్తో తిరుపతి తలపై కొట్టగా, అక్కడికక్కడే మతిచెందాడు. రెండు రోజులు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచాడు. దుర్వాసన వస్తుండడంతో మృతదేహాన్ని సంచిలో వేసి ఊరి బయట చెరువులో పడేశాడు. దుర్వాసన వస్తుండడంతో సంచిలో ఏం పట్టుకెళ్లావని ప్రశ్నించగా, కుక్క చనిపోయింది.. బయట పడేశా.. అని ధనుంజయ్ చెప్పాడని గ్రామస్తులు చెప్పారు. కాగా, ఆదివారం చెరువు వద్ద సంచిలో నుంచి శవం బయటకు రాగా గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ రాములు, సీఐ రాంనర్సింహారెడ్డి శవాన్ని బయటకు తీసి పంచనామా నిర్వహించి అక్కడే ఖననం చేశారు. మృతుడి సోదరుడు గుమ్మడి కోటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాంనర్సింహారెడ్డి తెలిపారు.