కేసముద్రం, ఏప్రిల్ 14 : చెరువులో మునిగిన ఎడ్లు, తాతా మనవడిని గొర్రెల కాపరి సాహసం చేసి కాపాడిన ఘటన కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పుణ్యపుర్తి అయిలయ్య, ఆయన మనుమడు అశ్విత్ ఎడ్లబండిపై ఆదివారం సాయంత్రం వ్యవసాయ భూమి నుంచి ఇంటికి వస్తున్నారు. ఎడ్లబండికి వెనకాల ఆవును తాడుతో కట్టారు. ఎడ్లకు నీళ్లు పెట్టడానికి స్థానికంగా ఉన్న చెరువు వద్దకు తీసుకెళ్లారు.
అక్కడే జేసీబీతో తీసిన గుంత కనిపించక బండిఎడ్లు, ఆవు, రైతు అయిలయ్య, మనుమడు అశ్విత్ నీటిలో మునిగిపోయారు. అక్కడే గొర్రెలను మేపుతున్న గొర్రెల కాపరి గమనించి అయిలయ్య, అశ్విత్, ఎడ్లను గుంతలో నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఆవు మాత్రం నీటిలో మునిగి మృతి చెందింది. గొర్రెల కాపరి విజయ్ సాహసం చేసి రైతు అయిలయ్య, అశ్విత్, ఎడ్లను కాపాడడంతో గ్రామస్తులు అతడిని అభినందించారు.