వరంగల్ చౌరస్తా, డిసెంబర్ 21 : ప్రపంచవ్యాప్తంగా వైద్య విధానంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు ప్రెసిడెంట్ డాక్టర్ అరుణా విశ్వనాథ్ వాణికర్, సభ్యుడు డాక్టర్ విజయేంద్రకుమార్ అన్నారు. కాకతీయ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన మెడికల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ రీజినల్ సెంటర్ను గురువారం మెడికల్ కమిషన్ ప్రతినిధులు ప్రారంభించారు. అనంతరం కేఎంసీ ఆడిటోరియంలో ప్రిన్సిపాల్ డాక్టర్ దివ్వెల మోహన్దాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఆధునిక యుగంలో వైద్యరంగంలో చాలా మార్పులు వచ్చాయని, వాటిపై విద్యాబోధకులకు సైతం అవగాహన ఉండాలన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో హైదరాబాద్లోని మహాత్మాగాంధీ మెడికల్ కళాశాల, భాస్కర మెడికల్ కళాశాలల్లో మాత్రమే అందుబాటులో ఉన్న టెక్నాలజీ రీజినల్ సెంటర్ ఇప్పుడు వరంగల్ కేఎంసీలో అందుబాటులోకి వచ్చిందన్నారు.
ఈ కేంద్రానికి ముందుగా ఆరు నెలల కాలవ్యవధితో అనుమతులు అందిస్తారని, నిర్వహణ తీరును పరిశీలించి పూర్తిస్థాయి అనుమతులు మంజూరు చేస్తారని వెల్లడించారు. ఈ రీజినల్ సెంటర్ పరిధిలో 12 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశామన్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ విధానంలోని ఫ్యామిలీ అకాడమీ ప్రోగ్రాం (ఎఫ్ఏపీ)ని అమలు చేస్తున్న విధానాన్ని పరిశీలించేందుకు బుధవారం ఆత్మకూరు గ్రామాన్ని సందర్శించామని వివరించారు. కార్యక్రమంలో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్రెడ్డి, భాస్కర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చలం, మహాత్మాగాంధీ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్వీఎన్ రెడ్డి, ఎంజీఎం దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, కేఎంసీ మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్ కన్వీనర్ డాక్టర్ విజయ్కుమార్ పాల్గొన్నారు.