జననేత.. సీఎం కేసీఆర్ చెంతకు జనవరద పారింది. మానుకోటలో ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ శంకర్నాయక్, భట్టుపల్లిలో వర్ధన్నపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలకు గులాబీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు తండోపతండాలుగా తరలిరావడం బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తున్నంత సేపు సభికుల చప్పట్లు, ఈలలతో మద్దతు లభించింది. సభల్లో కళాకారుల ఆటపాటలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది
మహబూబాబాద్, నమస్తే తెలంగాణ/వర్ధన్నపేట : ఉమ్మడి జిల్లా పరిధిలో శుక్రవారం నిర్వహించిన మహబూబాబాద్, వర్ధన్నపేట ప్రజా ఆశీర్వాద సభలకు జనం వరదలా తరలివచ్చింది. సీఎం కేసీఆర్కు మద్దతుగా దండులా కదలివచ్చింది. సభల్లో కేసీఆర్ ప్రసంగిస్తున్నంత సేపు ప్రజలు, అభిమానులు, పార్టీ శ్రేణులు చేతులెత్తి జై కొట్టారు. ఈలలు వేస్తూ, చప్పట్లు కొడుతూ మద్దతు ప్రకటించారు. వివిధ వర్గాల ప్రజలు, గిరిజన లంబాడా మహిళలు నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఎర్రటి ఎండను కూడా లెక్కచేయకుండా ప్రజలు సీఎం కేసీఆర్ ప్రసంగం కోసం ఆసక్తిగా వేచి ఉన్నారు. మానుకోటలో హెలికాప్టర్ ల్యాండ్ అవుతూ సీఎం కేసీఆర్ అభివాదం చేస్తుండగా, ఆయన స్టేజీ పైకి వస్తుండగా ఈలలు, కేరింతలతో హోరెత్తించారు. బానోత్ శంకర్ నాయక్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ కోరగా చప్పట్లు, ఈలలతో తమ ఆమోదాన్ని తెలిపారు. భట్టుపల్లిలో నిర్వహించిన వర్ధన్నపేట సభకు నియోజకవర్గంలోని ఐనవోలు, హసన్పర్తి, పర్వతగిరి, హనుమకొండ, వర్ధన్నపేట మండలాల నుంచి సుమారు 80వేల మందికిపైగా తరలివచ్చారు. కార్యకర్తలు, మహిళలు బీఆర్ఎస్ జెండాలు, కండువాలతో పెద్ద ఎత్తున తరలి రావడంతో సభా ప్రాంగణం పూర్తిగా గులాబీ మయమైంది. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి రాష్ట్ర ఆవిర్భావం, బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ వివరిస్తున్న సమయంలో ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. భట్టుపల్లిలో సభ అనంతరం పారీ ్టశ్రేణులు ప్రాంగణం చివరన సుమారు గంటపాటు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. సభ పూర్తయిన తరువాత కూడా ప్రాంగణంలో యువకులు బీఆర్ఎస్ పాటలకు డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. కాగా సభలను విజయవంతం చేసిన పార్టీ కార్యకర్తలు, వలంటీర్లకు ఎమ్మెల్యేలు శంకర్నాయక్, అరూరి రమేశ్ కృతజ్ఞతలు తెలిపారు. రెండు చోట్లా సభలు సూపర్ సక్సెస్ కావడంతో గులాబీ శ్రేణులు నూతనోత్సాహంలో మునిగిపోయారు.
నెల్లికుదురు/మడికొండ, అక్టోబర్ 27 : మహబూబాబాద్, వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలు ధూంధాంలతో హోరెత్తాయి. కళాకారుల ఆటపాటలతో ఉర్రూతలూగాయి. మహబూబాబాద్లో మధుప్రియ, మానుకోట ప్రసాద్, సౌమ్య తమ పాటలతో ఆకట్టుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ జబర్దస్త్ బృందం వినోదిని, కొమురక్క, నవీన్ ప్రదర్శించిన స్కిట్లు పలువురిని ఆలోచింపజేశాయి. భట్టుపల్లిలో కళాకారులు మిట్టపల్లి సురేందర్, మద్దెల సందీప్ తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంపై పాడిన పాటలకు ప్రజలు పాదం కలిపారు. కండువాలు, తువ్వాలలు ఊపుతూ డ్యాన్స్ చేశారు. సీఎం కేసీఆర్ వర్ధన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థిని పరిచయం చేస్తుండగా ప్రజలు ఒక్కసారిగా జై తెలంగాణ అంటూ నినదించారు. సభలో భరత్ కళాబృందం నృత్యాలు ఆకట్టుకున్నాయి.
రెండుచోట్ల బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సభలకు పోలీసులు భారీ బందోబస్తు కల్పించారు. ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూశారు. మహబూబాబాద్లో ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. భూపాలపల్లి పోలీసులు సైతం విధుల్లో పాలుపంచుకున్నారు. అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య, ఐదుగురు డీఎస్పీలు, 22 మంది సీఐలు, ఆర్ఐలు, ఇద్దరు మహిళా సీఐలు, 47 మంది ఎస్ఐలు, ఆర్ఏఎస్ఐలు, ఏడుగురు మహిళా ఎస్ఐలు, 34 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 214 మంది కానిస్టేబుళ్లు, 51 మంది మహిళా కానిస్టేబుళ్లు, 29 మంది హోంగార్డులు, 16 మంది ఏఆర్ పీసీలు సహా మొత్తం 428 మంది విధులు నిర్వర్తించారు. భట్టుపల్లి సభకు సెంట్రల్ జోన్ డీసీపీ బారీ ఆధ్వర్యంలో నలుగురు ఏసీపీలు, 12 మంది ఇన్స్పెక్టర్లు, 20 మంది ఎస్ఐలు, సిబ్బంది కలిపి సుమారు 600 మంది బందోబస్తు విధుల్లో పాలుపంచుకున్నారు.
బహిరంగ సభలకు తరలివచ్చినవారికి ఎక్కడా ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. మహిళలు, నాయకులు, కార్యకర్తలకు వేర్వేరుగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. వలంటీర్లతో వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు.