తాడ్వాయి, మే 3 : వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఆదివాసీ గిరిజన దైవాలైన మేడారం సమ్మక్క-సారలమ్మల మహా జాతర తేదీలను పూజారులు బుధవారం నిర్ణయించారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు పూజారులు సమావేశమై తేదీలను ప్రకటించారు. ప్రతి రెండేళ్లకొకసారి జరిగే మహా జాతరలో భాగంగా 2024 ఫిబ్రవరి 14వ తేదీన మాఘశుద్ధ పంచమి సందర్భంగా మండమెలిగే పండుగతో అమ్మవార్ల జాతర ప్రారంభమవుతుంది. 21వ తేదీ మాఘశుద్ధ ద్వాదశి బుధవారం రోజు సాయంత్రం గుడి మెలిగే పండుగతో పాటు సారలమ్మ దేవత, గోవిందరాజులు, పగిడిద్దరాజులు గద్దెలకు చేరుకుంటారు.
22వ తేదీ మాఘశుద్ధ త్రయోదశి గురువారం రోజు కంకవనం గద్దె మీదకు వచ్చుట, సాయంత్రం సమ్మక్క గద్దె మీదకు చేరుకుంటారు. 23వ తేదీ మాఘ శత్రుదశి శుక్రవారం సమ్మక్క-సారలమ్మ దేవతలు, గోవిందరాజులు, పగిడిద్దరాజుకు భక్తులు మొక్కులు చెల్లిస్తారు. 24వ తేదీ మాఘశుద్ధ పౌర్ణమి శనివారం రోజు దేవతలు వనప్రవేశం చేస్తారు. 28వ తేదీ మాఘశుద్ధ బహుల పంచమి బుధవారం రోజు తిరుగు వారం పండుగను నిర్వహించనున్నట్లు పూజారులు నిర్ణయించారు.
సమావేశంలో పూజారుల సంఘం ప్రధాన కార్యదర్శి చంద గోపాల్రావు, ఉపాధ్యక్షులు కాక సారయ్య, సిద్ధబోయిన నర్సింగరావు, కార్యదర్శులు సిద్ధబోయిన స్వామి, సిద్ధబోయిన బోజారావు, సహాయ కార్యదర్శులు కాక వెంకటేశ్వర్లు, పెనక మురళి, సిద్ధబోయిన జనార్దన్, కొక్కెర కృష్ణయ్య, కోశాధికారి కొక్కరి రమేశ్, సహాయ కోశాధికారి సిద్ధబోయిన అరుణ్కుమార్, కాక కిరణ్, కార్యవర్గ సభ్యులు సిద్ధబోయిన మునేందర్, సిద్ధబోయిన లక్ష్మణ్రావు, చంద బాబురావు, ఎంపలి మహేశ్, కాక లక్ష్మీబాయి, కాక భుజంగరావు, కాక కనకమ్మ, దబ్బకట్ల గోవర్ధన్, పెనక బుచ్చిరామయ్య ఉన్నారు.