కాశీబుగ్గ, 19 పత్తి పంట ధర రోజురోజుకూ పడిపోతున్నది. ధర లభించకపోవడంతో పత్తి రైతులు దిగాలు చెందుతున్నారు. గత ఏడాదితో పోల్చితే దిగుబడి తగ్గడంతోపాటు ధరలు కూడా తగ్గాయి. అక్టోబర్ 30న క్వింటాల్ పత్తికి అత్యధికంగా రూ.7వేల 160 పలికింది. భారత ప్రభుత్వ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) క్వింటాల్కు రూ.7,020 మద్దతు ధర నిర్ణయించింది. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ ధరకు కొనుగోలు చేసేందుకు మార్కెట్ పరిధిలో సెంటర్ ఏర్పాటు చేసింది. వరంగల్ మార్కెట్ పరిధిలోని ఎనుమాముల, గొర్రెకుంట, కొత్తపేటలో ఉన్న టీఎంసీ, జిన్నింగ్ మిల్లుల వద్ద కూడా రైతులు నేరుగా లూజు పత్తిని తీసుకెళ్లి అమ్ముకునేలా వెసులుబాటు కల్పించారు. తేమ శాతం ఎక్కువ ఉందని, నాణ్యతగా లేదంటూ కొర్రీలు పెట్టి మద్దతు ధర కంటే తక్కువగానే చేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.
అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో తరుగు ఎక్కువగా తీస్తున్నట్లు పలువురు రైతులు బోరుమంటున్నారు. గత ఏడాది క్వింటాల్ పత్తి అత్యధికంగా రూ.8,500 పలికింది. ఈ ఏడాది సీజన్ ప్రారంభంలోనే సీసీఐ మద్దతు ధర నిర్ణయించగా, వ్యాపారులు మద్దతు ధర కంటే తక్కువకు కొంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ లేదని, ఈసారి పత్తి నాణ్యత బాగా అందుకే తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. ఈ సీజన్ అక్టోబర్ నుంచి గురువారం వరకు మార్కెట్కు 6లక్షల 77వేల 14 క్వింటాళ్ల పత్తి రాగా ప్రైవేట్ వ్యాపారులు లక్షా 55 వందల క్వింటాళ్లు, లూజు పత్తి 70వేల 985 క్వింటాళ్లు, వ్యాపారులు జిన్నింగ్ మిల్లుల వద్ద 27వేల 245 క్వింటాళ్లు, సీసీఐ వారు 3లక్షల 66వేల 117 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్లు అధికారులు వివరించారు.