ములుగురూరల్, జనవరి 18 : కేసీఆర్ ప్రభుత్వం తమను దళిత బంధు పథకానికి ఎంపిక చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇవ్వకుండా మోసం చేస్తున్నదని ఆరోపిస్తూ లబ్ధిదారులు గురువారం ములుగు కలెక్టరేట్లోని వాటర్ ట్యాంక్ ఎక్కి పెట్రోల్ పోసుకొని నిరసన తెలిపారు. సుమారు ఆరు గంటల పాటు ఆందోళన చేశారు. మంత్రి సీతక్క లేదా కలెక్టర్ ఇలా త్రిపాఠి రావాలని, తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో కవ్వంపల్లి బాబు, మీదిగొండ రాజేంద్రప్రసాద్, ఊట్ల మోహన్ పెట్రోల్ చేత డబ్బా పట్టుకోగా రాజేంద్రప్రసాద్ మీద పోసుకొని తన ఆవేదనను వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ విజయ్భాస్కర్, ఎస్సై వెంకటేశ్వర్ సిబ్బంది వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా న్యాయం చేసేవరకూ ఊరుకునేది లేదన్నారు.
నిరసన ఉధృతంగా మారుతుండటంతో ఆర్డీవో సత్యపాల్రెడ్డి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, కలెక్టర్కు తెలియజేసి ప్రభుత్వానికి నివేదించనున్నట్లు హామీ ఇవ్వడంతో కిందకు దిగారు. ములుగు పర్యటనలో ఉన్న మంత్రి, కలెక్టర్ రాకపోవడంతో కలెక్టరేట్ను ముట్టడించారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు దళితబంధు సాధన కమిటీ జిల్లా అధ్యక్షుడు కోగిల మహేశ్ను అరెస్టు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ జిల్లాలోని 1,100 మంది 2వ విడత దళిత బంధు పథకానికి ఎంపికయ్యారని, తమ ఖాతాల్లో వెంటనే డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో లబ్ధిదారులు కర్రి శ్యాంబాబు, పసుల కార్తీక్, చంద్రబాబు, గట్టయ్య, కనకం లింగమూర్తి, జీ నగేశ్, చింత రాజు, శ్రీనివాస్, రాజు పాల్గొన్నారు.