బయ్యారం, జూలై 1 : అటవీ భూములనే నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటున్న పోడు రైతులు పట్టలేనంత ఆనందంలో ఉన్నారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇస్తామని మాట ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగానే గిరిజనుల పోడు భూములకు పట్టాలు అందిస్తున్నది. శుక్రవారం మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో పోడు రైతులకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ లాంఛనంగా ప్రారంభించడంతో వారి సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. ఎన్నో ఏండ్లుగా పోడు భూములకు పట్టాలు లేకపోవడం, ప్రతి వ్యవసాయ సీజన్లో అటవీ శాఖ అధికారులతో ఇబ్బందులు తలెత్తడంతో పోడు భూముల్లో పంట వేసినా చేతికి వచ్చేవరకూ ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఉండేది.
అంతేకాకుండా నీటి వసతి లేని సమయాల్లో పోడు భూముల్లో బోరు, బావి తవ్వుకుందామంటే అనుమతి ఇవ్వకపోవడం వల్ల పంటలు ఎండిపోయేవి. ఈ నేపథ్యంలో పోడు సమస్య నుంచి గిరిజన ప్రజలకు విముక్తి కల్పించాలని సంకల్పించిన ప్రభుత్వం పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఒక లక్షా 51వేల మందికి 4.06 లక్షల ఎకరాల పోడు పట్టాలు అందిస్తే కేవలం మహబుబాబాద్ జిల్లాలోనే 24,181 మంది రైతులకు 67,730 ఎకరాల పోడు పట్టాలు అందించడం విశేషం. అంతేకాకుండా ఇప్పటికే జిల్లాలో ఉన్న సుమారు నాలుగు లక్షల ఎకరాలకు 400 కోట్ల రైతుబంధు ఇస్తుండగా పోడు పట్టాలు లబ్ధిదారులకు అదనంగా రూ.68కోట్లు అందించనున్నారు. అలాగే పోడు రైతులకు రాయితీపై ఎరువులు, విత్తనాలు కూడా అందనున్నాయి. వీటితో పాటు రైతు బీమా వర్తింపజేయనున్నారు.
పోడు రైతులు మరణిస్తే వారం రోజుల్లోపే రూ.5 లక్షల రైతు బీమా సాయం అందుతుంది. అలాగే ములుగులో 18,869 ఎకరాలకు 7,413మందికి భూపాలపల్లి జిల్లాలో 8537 ఎకరాలకు 3,215మందికి వరంగల్లో 8366 ఎకరాలకు 3,654 మందికి హనుమకొండ జిల్లాలో 65 ఎకరాలకు గాను 70మందికి పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వనున్నారు. ప్రభుత్వం పోడు పట్టాల పంపిణీ ప్రారంభించడంతో గిరిజన గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఏ నలుగురు కలిసినా పోడు పట్టాల గురించి చర్చించుకోవడం కనిపిస్తోంది. వస్తాయా రావా అనుకున్న పోడు పట్టాలు చేతికందుతున్న వేళ ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పోడు పట్టాల కోసం కృషిచేసిన గ్రామాల్లోని ప్రజాప్రతినిధుల కృషిని కొనియాడుతున్నారు.
పోడు పట్టాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నాటి నుంచి సుమారు రెండేండ్ల పాటు అధికార యంత్రాంగం శ్రమించింది. మానుకోట జిల్లా కలెక్టర్ శశాంక నేతృత్వంలో గిరిజన సంక్షేమ శాఖ, రెవెన్యూ, ఫారెస్ట్, పంచాయతీ అధికారులు తీవ్రంగా కృషి చేశారు. జిల్లావ్యాప్తంగా అటవీ ప్రాంతాలు కలిగి ఉన్న గార్ల, బయ్యారం, కొత్తగూడ, నెల్లికుదురు, కేసముద్రం, గూడూరు, కురవి, మహబూబాబాద్, గంగారం మండలాల్లోని 154 గిరిజన పంచాయతీల్లో 344 గ్రామాల్లో పోడు భూముల పట్టాల కోసం సుదీర్ఘ కసరత్తు చేసి అర్హుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు. అనంతరం వాటిని జిలాస్థాయిలో పరిశీలించి డీఎల్సీ(డిస్ట్రిక్ట్ లెవక్ కమిటీ), ఎస్డీఎస్సీ(సబ్ డివిజన్ లెవల్ కమిటీ) కమిటీలు ఆమోదం తెలిపిన తర్వాతతాన్లైన్ ప్రక్రయ పూర్తి చేసి పట్టాలు ముద్రించారు. పోడు భూముల పట్టాల పంపిణీ లాంఛనంగా ప్రారంభం కావడంతో గ్రామాల్లో లభ్ధిదారులకు అందించేందుకు సిద్ధమయ్యారు.
గంగారం : పోడు వ్యవసాయం చేసుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకుంటున్న. తెలంగాణ ప్రభుత్వం పోడు హక్కు పత్రాలు ఇస్తున్నదని తెలిసి మస్తు సంబురపడ్డ. నాకు ఒక ఎకరం 27 గుంటల పోడు భూమి ఉంది. హక్కు పత్రాలు వచ్చిన తర్వాత రైతుబంధు కూడా ఇస్తమని సీఎం కేసీఆర్ సారు చెప్పిండు. చాలా సంతోషం. ఇక నాకు కూడా పెట్టుబడికి ఇబ్బంది లేకుంట రైతుబంధు డబ్బులు బ్యాంక్ ఖాతాలో జమైతయ్. ఎన్నో ఏళ్ల నుంచి పోడు భూములకు పట్టాల కోసం ఇబ్బందిపడ్డం. ఇప్పుడు బీఆర్ఎస్ సర్కారు పోడు భూములకు పాసు పుస్తకాలు ఇస్తూ రైతుబంధు, రైతుబీమా ఇయ్యడం చాలా సంతోషంగా ఉంది.
– జెజ్జరి శ్రీను
కొత్తగూడ : పట్టాల కోసం ఏనాటి నుంచో ఎదురుచూస్తున్నం. ముఖ్యమంత్రి కేసీఆర్ సారు నిజంగా మాటిచ్చినట్టే పోడు భూములకు హక్కులు కల్పించిండు. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంకనే మా కల నెరవేరింది. పోడు పట్టాలతో పాటు ప్రభుత్వ పథకాలు కూడా మాకు అందుతయని చెబుతున్నరు. రైతుబంధు, రైతుబీమా కూడా ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు రైతులందరూ సంబురంగా వ్యవసాయం చేసుకుంటరు. ఇదంతా కేసీఆర్ సారు పుణ్యమే.
– సిద్దబోయిన భద్రయ్య
కొత్తగూడ : పోడు భూములకు పట్టాలు వస్తాయని ఎప్పుడు కూడా అనుకోలేదు. తెలంగాణ ఫ్రభుత్వం పోడు భూములకు హక్కులు కల్పించడం చాలా సంతోషంగా ఉంది. దీని వల్ల ఎన్నో ఏండ్ల కల నెరవేరింది. మాకు రేపో, మాపో పట్టాలు వస్తాయని చెప్పారు. బీఆర్ఎస్ సర్కారు మాకు చేసిన మేలు ఎన్నటికీ మరువం. ఇక సంబురంగా వ్యవసాయం చేసుకుంటం. పోడు పట్టాలు ఇచ్చిన సీఎం కేసీఆర్ సారు సల్లగ ఉండాలె.
– సిద్దబోయిన సారంగపాణి
పోడు భూములకు పట్టా కోసం నాలుగు దశాబ్దాలుగా ఎదరుచూస్తున్నాం. గిరిజన ప్రాంతాల్లో నివసించే మాకు పోడు భూములే ఆధారం. కానీ వాటికి హక్కు పత్రాలు లేక ప్రతి ఏటా అటవీ అధికారులతో ఇబ్బంది పడేవాళ్లం. వర్షాలు పడి పంటలు వేసుకోగానే అటవీ అధికారులు పంటలు ధ్వంసం చేసి అటవీ భూములంటూ లాక్కునేందుకు ప్రయత్నించేవారు. ఇన్నాళ్లకు మా ఇబ్బందులు తీరాయి. పోడు భూములకు పట్టాలు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇక మంచిగ వ్యవసాయం చేసుకుంటం.
– గుగులోత్ భీముడు,
కస్తూరినగర్, బయ్యారం
పోడు భూమికి పట్టాలు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. పంటలు సాగు చేసుకుంటున్న మాకు ఇంతకాలం రైతు బీమా, రైతుబంధు లేక చాలా ఇబ్బంది పడ్డాం. రాయితీపై ఎరువుల కూడా రాక ఆర్థికంగా భారం పడింది. ఇక పోడు భూమికి హక్కు పత్రాలు వస్తే పథకాలు కూడా వర్తిస్తాయి. చాలా సంతోషం. సీఎం కేసీఆర్ పుణ్యమా అని మాకు పట్టాలు వస్తున్నయ్. పంటలు బాగా పండిస్తాం. పట్టా పుస్తకాలు ఇచ్చిన ప్రభుత్వాన్ని మర్చిపోము.
– వజ్జా సావిత్రి, గురిమళ్ల, బయ్యారం