వరంగల్ జిల్లాలో మరో నాలుగేళ్లలో 57వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయొచ్చని ఉద్యానశాఖ అధికారులు అంచనా వేశారు. సంప్రదాయ సాగుతో పాటు రైతులను లాభదాయకమైన వాణిజ్య పంటల సాగు వైపు మళ్లించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నది. జిల్లాలో ఇప్పటికే 3,200 ఎకరాల్లో మొక్కలు పెంచుతున్న 948 మంది రైతులకు డ్రిప్ ఏర్పాటుకు 80 నుంచి 100 శాతం సబ్సిడీ ఇవ్వడంతో పాటు ఒక్కో మొక్కకు రూ.193 అందజేస్తున్నది. ఒక్కో ఎకరానికి నాలుగేళ్లపాటు రూ.4,200 పెట్టుబడి సాయం ఇస్తున్నది. ఎరువుల కోసం రూ.2,100, అంతర పంటల సాగుకు రూ.2,100 ముట్టజెప్తున్నది. సర్కారు ప్రోత్సాహంతో రైతులు ఈ ఏడాది మరో 9,500 ఎకరాల్లో ఆయిల్పామ్ తోటలు సాగు చేస్తారని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే తిర్మలాయపల్లి వద్ద రాంచరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం భూమిని సేకరించే పనిలో ఉన్నది.
– వరంగల్, జూలై 31(నమస్తేతెలంగాణ)
వరంగల్, జూలై 31(నమస్తేతెలంగాణ) : సంప్రదాయ సాగుతో పాటు రైతులను లాభదాయకమైన వాణిజ్య పంటల సాగు వైపు మళ్లించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు సబ్సిడీలు అందజేస్తున్నది. దీంతో రైతులు ఆయిల్ పామ్ సాగుకు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో ఇప్పటికే 948 మంది రైతులు సుమారు 3,200 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేశారు. ఈ ఏడాది రైతులు మరో 9,500 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేస్తారని ఉద్యాన శాఖ అధికారులు భావిస్తున్నారు. ఆయిల్పామ్ సాగులో రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికారులు సర్వే జరిపి ఆయిల్పామ్ సాగుకు అనువైన భూములను గుర్తించారు. దీనిలో భాగంగా జిల్లాలో దాదాపు 57 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయవచ్చని ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ మేరకు దశలవారీగా నాలుగేళ్లలో 57 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుకు రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం ఉద్యానశాఖ అధికారులకు లక్ష్యం నిర్దేశించింది. దీంతో ఉద్యానశాఖ అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఒక ఎకరంలో ఆయిల్పామ్ సాగు చేయడానికి 57 మొక్కలు అవసరం. ప్రభుత్వం వీటిని సబ్సిడీపై రైతులకు అందజేస్తున్నది.
ఇప్పటికే ఎన్ని ఎకరాల్లో అంటే..
జిల్లాలో తొలి సంవత్సరం 2022-23లో 4,018 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుకు ఉద్యానశాఖ అధికారులు ప్రతిపాదించారు. ఈ మేరకు ప్రభుత్వం 3,211 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుకు పాలనపరమైన అనుమతులు ఇచ్చింది. ముందుకొచ్చిన రైతులకు ఒక్కో ఎకరానికి 57 మొక్కల చొప్పున సబ్సిడీపై ఉద్యానశాఖ అధికారులు అందజేశారు. దీంతో 761 మంది రైతులు గత మార్చి నెలాఖరు వరకు 2,650 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేశారు. దీనిలో మండలంవారీగా గీసుగొండలో 102, సంగెంలో 219, ఖిలావరంగల్లో 5, వరంగల్లో 11.95, చెన్నారావుపేటలో 187, దుగ్గొండిలో 165, ఖానాపురంలో 166, నల్లబెల్లిలో 109, నర్సంపేటలో 122, నెక్కొండలో 224, పర్వతగిరిలో 644, రాయపర్తిలో 317, వర్ధ్దన్నపేటలో 379 ఎకరాలు ఉన్నట్లు ఉద్యానశాఖ అధికారి శంకర్ వెల్లడించారు. ప్రస్తుత 2023-24 సంవత్సరం జిల్లాలో 10,100 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుకు అధికారులు ప్రణాళిక తయారు చేశారు. ఇందులో 1,265 ఎకరాల్లో సాగుకు ప్రభుత్వం నుంచి పాలనపరమైన అనుమతులు లభించాయి. ఇప్పటి వరకు 187 మంది రైతులు 550 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేశారు. మార్చి నెలాఖరు వరకు నిర్ధేశిత లక్ష్యాన్ని అధిగమించే దిశగా ఉద్యానశాఖ అధికారులు అడుగులు వేస్తున్నారు.
ఫ్యాక్టరీ నిర్మాణానికి సన్నాహాలు
జిల్లాలో ఆయిల్పామ్ సాగు చేసే రైతులకు మొక్కలను సరఫరా చేయడం, వారి నుంచి ఆయిల్పామ్ దిగుబడులను సేకరించే కాంట్రాక్టును రాంచరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ దక్కించుకుంది. ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకుని ఆయిల్పామ్ మొక్కల పెంపకం కోసం సంగెం మండలంలోని రామచంద్రపురం గ్రా మం వద్ద నర్సరీని ఏర్పాటు చేసింది. ఈ నర్సరీలో పెంచుతున్న మొక్కలను ఆయిల్పామ్ సాగు చేసే రైతులకు సరఫరా చేస్తుంది. జిల్లాలో ఆయిల్పామ్ సాగు చేసే రైతులకు సరిపడా మొక్కలు ఈ నర్సరీలో ఉన్నట్లు ఉద్యానశాఖ అధికారి శంకర్ చెప్పారు. ఒప్పం దం ప్రకారం ఆయిల్పామ్ సాగు చేయడం ప్రారంభమైన తర్వాత నాలుగేళ్ల వరకు ఫ్యాక్టరీని రాంచరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ అందుబాటులోకి తేవల్సి ఉంది. గతేడాది ఆయిల్పామ్ సాగు చేసిన రైతులకు మరో మూడేళ్లలో దిగుబడులు రానున్న దరిమిల గడువు సమీపిస్తుండడంతో ఈ ఇండస్ట్రీస్ జిల్లాలో ఫ్యాక్టరీ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టేందుకు రాయపర్తి మండలంలోని తిర్మలాయపల్లి గ్రామం వద్ద భూసేకరణకు పూనుకుంది. భూసేకరణ పక్రియ పూర్తి కాగానే అనుమతులను పొంది ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను ప్రారంభించే ఏర్పాట్లలో రాంచరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ ఉన్నట్లు తెలిసింది.