తాడ్వాయి, జనవరి 31 : మేడారం మహా జాతర ముగిసింది.. జన సంద్రమై, కాలు కదిపేందుకు వీలుగాని ప్రాంతం ఖాళీ అయింది. వన దేవతలు జనంలోకి వచ్చి నాలుగు రోజులు మొకులు అందుకున్నారు. ఆదివాసీ సంప్రదాయలతో పూజారులు(వడ్డెలు) తల్లులను శనివారం సాయంత్రం వనంలోకి తీసుకెళ్లారు. తొలుత మేడారం సమ్మక్క పూజారుల్లో ప్రధాన పూజారి సిద్ద్ధబోయిన ముణింధర్ ఇంటి వద్దకు చేరుకున్నారు. అనంతరం సమ్మక్క గద్దె వద్దకు వెళ్లి ఆడపడుచులు అలుకుపూతలు నిర్వహించిన తర్వాత సమ్మక్క తల్లిని డోలివాయిద్యాల నడుమ వనప్రవేశం చేశారు. ఆ దృశ్యం చూసేందుకు లక్షల మంది భక్తులు వచ్చారు. జాతర చివరిరోజు దాదాపు ఎనిమిది లక్షల మంది వన దేవతలను దర్శించుకున్నారు. వరాల తల్లుల వనప్రవేశం తర్వాత సైతం భక్తులు మొకులు చెల్లించుకున్నారు.

ఉద్విగ్నంగా సాగిన ఘట్టం
సమ్మక్క, సారలమ్మ వనప్రవేశ కార్యక్రమంలో భాగం గా ఆదివాసీ పూజారులు డోలు చప్పుళ్లతో గద్దెపైకి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గద్దెలపై భక్తులు సమర్పించిన చీరసారె, బంగారం, పసుపు కుంకుమలను మేడారం వాసులు తీసుకున్నారు. దేవతల ప్రసాదాన్ని(బెల్లం) తీసుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. దర్శనాల ప్రక్రియను పూర్తిగా నిలిపివేసిన తర్వాత వనప్రవేశ ఘట్టం మొదలైంది. తొలుత గోవిందరాజును అర్రెం వంశీయులు, సమ్మక్క భర్త పగిడిద్దరాజును పెనక బుచ్చిరాములు నేతృత్వంలోని పూజారుల బృందం మేడారం గద్దె నుంచి సరిగ్గా రాత్రి 7.35 గంటలకు కొండాయి, పూనుగుండ్లకు తరలించారు.
సారలమ్మ గద్దెపై ప్రతిష్ఠించిన మెంటె (వెదురుబుట్ట)ను7.49 గంటలకు తీసుకుని జంపన్నవాగు మీదుగా కన్నెపల్లికి చేర్చారు. అలాగే కొకెర కృష్ణయ్య నేతృత్వంలోని పూజారుల బృందం సమ్మకను గద్దె నుంచి కదిలించి 7.58 గంటలకు చిలుకలగుట్టకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో గద్దెల సమీపంలోని ఎదురోళ్ల ప్రదేశం వద్ద మేక బలితో పూజలు నిర్వహించారు. దేవతల వనప్రవేశంతో మేడారం మహా జాతర అధికారికంగా ముగిసింది. వచ్చే బుధవారం మేడారం పూజారులు చేసే తిరుగువారం పండుగతో మహాజాతర అంకం పరిసమాప్తం కానున్నది.